అసోంని వీడని వరద ముప్పు.. 109కి చేరిన మరణాలు

ఈశాన్య రాష్ట్రం అసోంని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆదివారం రాత్రి కరీంగంజ్ జిల్లాలో ఒకరు, నిజాంబజార్ జిల్లాలో ఒకరు చనిపోయినట్లు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తెలిపింది.

Update: 2024-07-15 07:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం అసోంని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆదివారం రాత్రి కరీంగంజ్ జిల్లాలో ఒకరు, నిజాంబజార్ జిల్లాలో ఒకరు చనిపోయినట్లు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తెలిపింది. దీంతో, భారీ వర్షాలు, వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 109కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. గతకొంతకాలంగా అసోంలో వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరింది. అయితే, అసోంలోని పలు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గౌహతి వాతావరణ కేంద్రం రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

దాదాపు 6 లక్షల మందిపై వరద ప్రభావం

వరదల కారణంగా దాదాపు 6 లక్షల మంది ప్రభావితం అయ్యాయని అధికారులు తెలిపారు. కాచార్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రీ, దిబ్రూగఢ్, గోల్‌పరా, గోలాఘాట్, జోర్హాట్, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలిటన్, కరీంగంజ్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరీ, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. కాచర్ జిల్లాలో దాదాపు 1.16 లక్షల మంది వరద ప్రభావితమయ్యారు. ధుబ్రిలో సుమారు 81 లక్షల మంది, నాగావ్‌లో 76 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం అధికారులు సహాయశిబిరాలు ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లో 172 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం 58,816 మంది నిర్వాసితులు ఉన్నారు. అసోంలోని 1,342 గ్రామాలు నీటమునిగాయని అధికారులు తెలిపారు. 25 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వెల్లడించారు.


Similar News