18వ లోక్సభకు ఏర్పాట్లు.. కార్యకలాపాల నిర్వహణలో కీలక నిర్ణయం
18వ లోక్ సభ నిర్వహణ కోసం లోక్ సభ సచివాలయం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
దిశ, వెబ్డెస్క్: 18వ లోక్ సభ నిర్వహణ కోసం లోక్ సభ సచివాలయం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క శాతం కూడా పేపర్ వాడకుండా కార్యకలాపాల నిర్వహణకు అధికారులు శ్రీకారం చుట్టారు. కొత్త సభ్యుల రిజిస్ట్రేషన్ నుంచి అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే సచివాలయం చేపట్టింది. డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంపికైన వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పార్లమెంటు ప్రాంగణంలో గైడ్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చే కొత్త సభ్యుల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి పార్లమెంటుకు వెళ్లే ఏర్పాట్లను అధికారులు చేశారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులకు తాత్కాలిక విడిది కోసం వెస్ట్రన్ కోర్టు హాస్టల్, హోటల్ అశోకా, ఎంఎస్ ప్లాట్స్లలో ఏర్పాట్లు చేశారు.24 గంటలు అందుబాటులో వైద్య సదుపాయాలు, సిజిహెచ్ ఎస్ సిబ్బందిని అధికారులు సిద్ధం చేశారు. పార్లమెంటులో వివిధ శాఖలకు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేశారు.ఫేస్ రికగ్నేషన్ ద్వారా కేంద్రీకృత ఐడీని అధికారులు రూపొందిస్తున్నారు. కొత్త ఎంపీలకు అవసరమైన సహకారం అందించేందుకు వివిధ మంత్రిత్వశాఖల అధికారులతో సమన్వయ బృందాల నియమించారు.