నీట్ యూజీ కేసులో మరొకరు అరెస్ట్..మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న సీబీఐ
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించిన కేసులో మహారాష్ట్రలో సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. రాష్ట్రంలోని లాతూర్లో పేపర్ లీకైనట్టు ఆరోపణలు ఉన్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించిన కేసులో మహారాష్ట్రలో సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. రాష్ట్రంలోని లాతూర్లో పేపర్ లీకైనట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో మహారాష్ట్ర పోలీసులు నంజునేతప్ప అనే వ్యక్తిని విచారించారు. తాజాగా ఆయననే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాతూర్లోని ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఐదు లక్షల రూపాయలకు పైగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. గతంలో బిహార్లో ఆరుగురిని, గుజరాత్లోని గోద్రాలో ఒక్కరిని, డెహ్రాడూన్కు చెందిన మరొకరిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సీబీఐ ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. వీటిలో బిహార్లోని ఎఫ్ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిననవి అభ్యర్థుల మోసానికి సంబంధించినవి. కాగా, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలను తమకు అందజేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.