న్యూఢిల్లీ : స్వదేశీ టెక్నాలజీతో భారత్ డెవలప్ చేసిన తేలికపాటి ఫైటర్జెట్ విమానం ‘ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ’లోకి మరో రెండు మేడిన్ ఇండియా పరికరాలను అమర్చనున్నారు. ‘ఉత్తమ్’ అనే పేరుతో తయారుచేసిన రాడార్, ‘అంగద్’ అనే పేరుతో తయారు చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు తేజస్లోకి చేరనున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈమేరకు రక్షణశాఖ వర్గాలు చెప్పాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
యుద్ధ విమానాల్లో స్వదేశీ పరికరాలను వాడటం ద్వారా యుద్ధ సమయాల్లో విదేశాల ఆంక్షల ప్రభావం సైన్యం పడకుండా చూడాలనే ముందుచూపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. దీని ద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. భారత వాయుసేన 83 ‘తేజస్ మార్క్ 1ఏ’ యుద్ధ విమానాల కోసం ఇప్పటికే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు ఆర్డర్ ఇచ్చింది. రానున్న రోజుల్లో మరో 97 యూనిట్ల కోసం ఆర్డర్ ఇవ్వాలని యోచిస్తోంది.