Anantnag encounter: గాడోల్ అడవుల్లో ఆర్మీ ఆపరేషన్..
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న కోకెర్నాగ్లోని గాడోల్ అడవుల్లో శుక్రవారం కూడా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేసేందుకు హెరాన్, క్వాడ్కాప్టర్ డ్రోన్లతో ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్, ఇంకో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని కశ్మీర్ పోలీసు విభాగం వెల్లడించింది.
ఈ టెర్రరిస్టుల ఏరివేతే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ ఆపరేషన్ను ఆర్మీ మొదలుపెట్టింది. అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటివరకు ఆర్మీ, పోలీసు విభాగాలకు చెందిన నలుగురు అమరులవగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో ఆఫీసర్ కనిపించకుండా పోయారు. అయినా ఉగ్రవాదుల ఏరివేత కోసం వీరోచితంగా భద్రతా దళాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.