Amith shah: కుకీ, మైతీ గ్రూపులతో చర్చలు జరుపుతున్నాం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
మణిపూర్లో శాంతి కోసం కుకీ, మైతీ వర్గాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్లో శాంతి కోసం కుకీ, మైతీ వర్గాలతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. మణిపూర్లో ఘర్షణలు జాతిపరమైనవని, ప్రభావిత సమూహాల మధ్య చర్చల ద్వారా మాత్రమే శాంతి నెలకొంటుందని చెప్పారు. మోడీ ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తైన సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల వివరాలను మంగళవారం మీడియాతో పంచుకున్నారు. ఇటీవలి మూడు రోజుల వ్యవధిలోనే హింస పెరిగిందని అంతేతప్ప గత మూడు నెలల్లో, పెద్ద సంఘటనేమీ జరగలేదన్నారు. సమస్యకు కారణమైన భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ వేయడం ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 30 కిలోమీటర్ల దూరం కంచె వేశామని చెప్పారు. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్లను ప్రారంభించడం ద్వారా మణిపూర్ ప్రజలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు.
త్వరలోనే జనగణన
దేశంలో జనాభా లెక్కలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. జనాభా గణన ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల ఈ కార్యక్రమం వాయిదా వడిందని చెప్పారు. 60 ఏళ్ల తర్వాత మొదటిసారిగా, దేశంలో రాజకీయ సుస్థిరత వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో రూ. 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదించిందని, మధ్య తరగతికి పన్ను ప్రయోజనాలు చేకూర్చిందని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ పథకం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ బీమా సౌకర్యం, మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు, ఇతర పథకాలను మూడో టర్ములో ఇప్పటివరకు అమలు చేశామన్నారు. మోడీ చొరవతొనే విజయవంతంగా అనేక పథకాలు అమలు చేశామన్నారు.