పరీక్షల నిర్వహణకు ఏఐ సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్న యూపీఎస్సీ
నీట్, నెట్ వివాదాలు కొనసాగుతున్న తరుణంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక చర్యలు తీసుకోనుంది.
దిశ, నేషనల్ బ్యూరో: నీట్, నెట్ వివాదాలు కొనసాగుతున్న తరుణంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక చర్యలు తీసుకోనుంది. అక్రమాలకు చెక్ పెటటేందుకు సాంకేతికతను వాడుకోనున్నట్లు తెలిపింది. వివిధ పరీక్షల్లో చీటింగ్ను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను రూపొందించకోవాలని నిర్ణయించింది. అభ్యర్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, పరీక్షల ప్రక్రియను పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
ప్రభుత్వరంగ సంస్థల నుంచి బిడ్లకు ఆహ్వానం
అయితే, ఈ సాంకేతికతల కోసం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు రెడీ అయ్యింది. ఇకపోతే, కేంద్ర సర్వీసు ఉద్యోగాల నియామకాల కోసం యూపీఎస్సీ.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 14 పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు పర్యవేక్షించడంతో పాటు పారదర్శకంగా నిర్వహించేందుకు సాంకేతికతను వాడుతోంది. ఇందులో భాగంగానే ఆధార్-ఆధారిత వేలిముద్రల ధ్రువీకరణ, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ-అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించుకోనుంది. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, కంట్రోల్ రూమ్ల దగ్గర కెమెరాలు ఏర్పాటు చేయనుంది. చీటింగ్ లేదా అక్రమాలు జరిగితే.. ఇన్విజిలేటర్ లేకున్నా ఏఐ అలెర్ట్ ఇచ్చేలా సాంకేతికతను ప్రవేశపెట్టనుంది.