బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురి మృతి, మరొకరికి గాయాలు

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో శనివారం ఉదయం బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది

Update: 2024-06-29 12:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో శనివారం ఉదయం బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పేలుడు తాకిడికి ఫ్యాక్టరీలో కొంత భాగం కూలిపోయింది. ప్రభావం ఎక్కువగా ఉండటంతో దాని పక్కనే ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. తెల్లవారుజామున పేలుడు సంభవించిందని సమాచారం అందడంతో అగ్నిమాపక, రెస్క్యూ సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

బాణసంచా తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు, ముడిపదార్థాల నిర్వహణ కారణంగా పేలుడు సంభవించిందని ప్రాథమికంగా గుర్తించారు. అయితే పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Similar News