ముంబై : మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య రాజకీయ చిచ్చు చల్లారడం లేదు. శరద్ పవార్ వర్గానికి చెక్ పెట్టే దిశగా అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం పావులు కదుపుతోంది. తాజాగా అజిత్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నార్వేకర్కు లేఖ రాసింది. దీంతోపాటు శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన చీఫ్ విప్ అనిల్ పాటిల్ అనర్హత పిటిషన్ను దాఖలు చేశారు.
శరద్ పవార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఎన్సీపీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పిటిషన్లో కోరారు. శరద్ పవార్ వెంట కంటిన్యూ అవుతున్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ వెంట వెళ్లిపోయిన ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వాదనలను వినిపించేందుకు అక్టోబర్ 6న ఢిల్లీకి రావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో మహారాష్ట్రలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే, ఎన్సీపీలోని రెండు వర్గాలు కూడా పార్టీలో చీలిక రాలేదని వాదిస్తుండటం గమనార్హం.