ఆర్మీ మరో కీలక నిర్ణయం.. బార్డర్లో భద్రతను పెంచడంపై ప్రత్యేక ఫోకస్..
బార్డర్లో భద్రతను పెంచడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
న్యూఢిల్లీ : బార్డర్లో భద్రతను పెంచడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నాలుగు రోజుల క్రితమే కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఎయిర్ బేస్లో మిగ్ 29 యుద్ధ విమానాలను మోహరించిన ఆర్మీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన నాలుగు కొత్త హెరాన్ మార్క్-2 డ్రోన్లను చైనా, పాకిస్తాన్ల సరిహద్దులలో మోహరించింది. ఈ డ్రోన్స్కు మిస్సైల్స్, ఇతర ఆయుధాలను ప్రయోగించే సామర్ధ్యం కూడా ఉంది. ఇండియా బార్డర్లోని నార్త్ సెక్టార్లో ఉన్న ఫార్వర్డ్ ఎయిర్ బేస్లో వీటిని రంగంలోకి దింపారు.
హెరాన్ మార్క్-2 డ్రోన్స్ గురించి..
హెరాన్ మార్క్-2 డ్రోన్స్లో శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది. ఇవి దాదాపు 36 గంటల పాటు విరామం లేకుండా నిఘా వ్యవహారాల్లో పనిచేయగలవు.యుద్ధ విమానాలకు హెల్పర్గా కూడా ఇవి పనిచేస్తాయి. లేజర్ లైట్ సహాయంతో యుద్ధ విమానాలకు శత్రు లక్ష్యాలను చూపించి.. దాడులు కచ్చితంగా చేసేందుకు హెరాన్ మార్క్-2 డ్రోన్స్ సహకరిస్తాయి. ప్రాజెక్ట్ చీతా అమలులోనూ భారత వైమానిక దళం సహకరిస్తోంది. చీతాల కదలికలను ట్రాక్ చేసే విషయంలోనూ హెరాన్ డ్రోన్ల(Missile Drones In Border) సహకారాన్ని తీసుకుంటున్నారు. త్వరలో అమెరికా నుంచి మన దేశానికి 31 ప్రిడేటర్ డ్రోన్లు కూడా అందబోతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే.. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పెద్ద ఏరియాలలో నిఘాను పెంచేందుకు నౌకాదళానికి చేదోడుగా ఉంటాయి.