Wayanad : వాయనాడ్ లో ప్రియాంక గాంధీపై నటి ఖుష్బూ పోటీ !
కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత, నటి ఖుష్పూ సుందర్ ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పై బీజేపీ నేత, నటి ఖుష్పూ సుందర్ ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ అభ్యర్థిగా ప్రియాంకాగాంధీని బరిలో దించాలని నిర్ణయించింది. ప్రియాంకాగాంధీని ఢీ కొట్టేందుకు నటి కుష్బూ సుందర్ ను బరిలోకి దించితే త్రిముఖ పోటీలో గెలుపు అవకాశాలుంటాయని కమలనాథులు యోచిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దించింది. తమ పార్టీ తరుపున సత్యన్ మొఖేరీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కాగా ప్రియాంక గాంధీపై తన పోటీకి సంబంధించి నటి కుష్బూ సుందర్ స్పందిస్తూ ఎన్నికల వేళ ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయన్నారు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే తాను ప్రియాంకాగాంధీపై పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు.
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్తో పాటు, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు. అనంతరం వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఈ లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. వాయనాడ్ లోక్సభ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.