రష్యా కొత్త రాయబారిగా అభయ్ ఠాకూర్
కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా రష్యాలో భారత నూతన రాయబారిగా అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా రష్యాలో భారత నూతన రాయబారిగా అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. ప్రస్తుత రాయబారి పవన్ కపూర్ స్థానంలో అభయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అభయ్ ఠాకూర్ 1992 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి. మరోవైపు 1990 బ్యాచ్కి చెందిన పవన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి(పశ్చిమ)గా నియమితులయ్యారు. అంతేగాక ఆస్ట్రియాలోని భారత రాయబారి జైదీప్ మజుందార్ అదే శాఖలో తూర్పు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. శంభూ కుమారన్ను మనీలా నుంచి వియన్నాకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆమె స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై కేంద్రం దృష్టి సారించింది. అయితే ఇటీవల పదవీ విరమణ చేసిన అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సంధు తదుపరి ప్రతినిధిగా నియమితులవుతారని తెలుస్తోంది.