Arvind Kejriwal: రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో బరిలోకి ఆప్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తామని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల్లో అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. ఆప్ కార్యకర్తలు పూర్తి సన్నద్దతతో ఉన్నారని చెప్పారు.
ఇండియా కూటమితో కలిసి బరిలోకి దిగుతారా, లేదా స్వతంత్రంగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కాగా, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.