సుప్రీంకోర్టు ప్రాంగణంలో మహిళా లాయర్ పై కోతుల దాడి
సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ మహిళా లాయర్ పై కోతులు దాడి చేశాయి.
దిశ,వెబ్డెస్క్:సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ మహిళా లాయర్ పై కోతులు దాడి చేశాయి. కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాది సెల్వకుమారి పై ఆకస్మత్తుగా కోతుల గుంపు దాడి చేసింది. కోతుల గుంపులోని ఒక కోతి ఆమె తొడను కొరికింది. ఈ ఘటనపై లాయర్ సెల్వకుమారి మాట్లాడుతూ..తాను కోర్టులోకి వెళ్లే సమయంలో ఒక కోతి తన తొడను కొరికిందని తెలిపారు. గేటు బయట తనను రక్షించేందుకు ఎవరూ లేరని చెప్పారు. అనంతరం తాను సుప్రీంకోర్టు డిస్పెన్సరీకి వెళ్లానని, అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. ప్రథమ చికిత్సకు మందులు కూడా లేవని అన్నారు. కేవలం గాయాన్ని శుభ్రం చేసి వదిలేశారని, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో ఉన్న పాలీక్లినిక్లో ఇంజెక్షన్ చేయించుకున్నారు. లాయర్ ఎస్.సెల్వకుమారి సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్లో శాశ్వత సభ్యురాలుగా ఉన్నారు.