చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో దివంగత జయలలితకు గతంలో అవమానం జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. జయలలితపై దాడి జరిగిన విషయంలో వాస్తవికత లేదన్నారు. జయలలిత సభలో నటించారన్న విషయం.. ఆనాడు అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. "వాట్సాప్ హిస్టరీ" ఆధారంగా నిర్మలా సీతారామన్ ఏదో విషయాన్ని చెప్పారని స్పష్టం చేశారు.
తమిళనాడు శాసనసభలో డీఎంకే ఎమ్మెల్యేల వల్ల జయలలితకు ఎలాంటి అవమానమూ జరగలేదని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే మాజీ నేత, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ తిరువనవుక్కరసార్ కూడా జయలలిత రిహార్సల్స్ ఒకసారి చేశారని స్టాలిన్ గుర్తుచేశారు.