Tripura: అక్రమంగా చొరబడ్డ ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్
భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు బంగ్లాదేశీయులను త్రిపుర పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు బంగ్లాదేశీయులను త్రిపుర పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దు గుండా భారత్లోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులను త్రిపుర పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సయుక్తంగా చేపట్టిన అపరేషన్లో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ అగర్తల ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ పేర్కొన్నారు. ‘అగర్తల శివార్లలోని సరిహద్దు లంకామురా పట్టణంలోకి కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా ప్రవేశించినట్లు సమాచారం అందడంతో ఆపరేషన్ ప్రారంభించాం. రంగంలోకి దిగిన పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు చొరబాటుదారులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులమని అంగీకరించారు’ అని పరితోష్ దాస్ అన్నారు.
అగర్తలా కోర్టుకు..
బంగ్లాదేశ్లోని రాజ్షాహి డివిజన్లోని చపాయ్ నవాబ్గంజ్ జిల్లాకు చెందినవారిగా అరెస్టయిన వారిని అధికారులు గుర్తించారు. అరెస్టు చేసినవారిని విచారణ కోసం అగర్తలాలో కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్లో చెలరేగిన ఘర్షణలు, రాజకీయ సంక్షోభం వల్ల అక్కడ పరిస్థితులు అధ్వానంగా మారాయి. అయితే, బంగ్లా పౌరులు భారత్లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరిహద్దులో బలగాలు భద్రత పెంచాయి.