జమ్మూలో 40 మంది పాక్ ఉగ్రవాదులు..భారీగా బలగాల మోహరింపు!
జమ్మూ కశ్మీర్లో ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కశ్మీర్ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35 నుంచి 40 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్లో ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కశ్మీర్ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35 నుంచి 40 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. ప్రధానంగా పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో టెర్రరిజాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా స్థానిక నెట్వర్క్ల సహాయంతో చిన్న బృందాలుగా పనిచేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీరు రెండు మూడు గ్రూపులుగా పనిచేస్తున్నారని, స్థానిక వ్యవస్థలతో వీరు కలిసిపోయినట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ, ఇతర భద్రతా సంస్థలు తమ గూఢచార కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. చొరబాటు ప్రయత్నాలను నియంత్రించడానికి భారీగా బలగాలను మోహరించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం, ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్లోని రెండో అంచెను పటిష్టం చేయడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని కూడా గుర్తించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. భారత సైన్యం ఇప్పటికే 200కి పైగా సాయుధ వాహనాలతో కూడిన అదనపు దళాలను మోహరించింది. ఈ వాహనాలు తీవ్ర వాద కార్యకలాపాలలో భాగం కానున్నాయి. జూన్ 9 నుంచి జమ్మూ కశ్మీర్లో నాలుగు ఉగ్రదాడులు జరిగాయి. అంతేగాక 2023లో 43 తీవ్రవాద దాడులు జరగగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 20 ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.