UP: దారుణం.. స్కూల్ సక్సెస్ కోసం 2వ తరగతి విద్యార్థి నరబలి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్‌ను కష్టాల నుంచి తప్పించడానికి 2వ తరగతి చదువుతున్న బాలుడిని బలి ఇచ్చారు

Update: 2024-09-27 10:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్‌ను కష్టాల నుంచి తప్పించడానికి 2వ తరగతి చదువుతున్న బాలుడిని బలి ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృతార్థ్(11 ఏళ్లు) అనే బాలుడు హత్రాస్ జిల్లాలో డీఎల్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. పాఠశాల యజమాని జశోధన్ సింగ్ మూఢనమ్మకాలను బాగా నమ్ముతాడు. ఇటీవల కాలంలో పాఠశాల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో నరబలిని ఇస్తే విజయం సిద్ధిస్తుందని, అన్ని కష్టాలు తొలగిపోతాయని తన కుమారుడు అయిన పాఠశాల డైరెక్టర్ దినేష్ బాఘేల్‌కు చెప్పాడు.

దీంతో పక్కా ప్లాన్ ప్రకారం, సెప్టెంబరు 23న, తండ్రీకొడుకులు, మరో ముగ్గురు సిబ్బందితో కలిసి బాలుడిని పాఠశాల హాస్టల్ నుంచి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, బాలుడు నిద్ర నుంచి లేచి భయంగా ఏడవడంతో అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు.. చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కుమారుడికి బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అయితే మార్గమధ్యంలో సదాబాద్ వద్ద కారును ఆపిన బాలుడి కుటుంబ సభ్యులు లోపల బాలుడి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తూ, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించారు. హత్రాస్ అదనపు సూపరింటెండెంట్ (ASP) అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, పాఠశాల వెనుక ఉన్న బావి వద్ద నర బలికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, అయితే చిన్నారి నిద్ర నుంచి బయటకు రావడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని తెలిపారు.

పాఠశాల శ్రేయస్సు కోసం 'బలి' చేసినందుకే విద్యార్థిని హత్య చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారు. అలాగే, సెప్టెంబర్ 6న కూడా 9 ఏళ్ల విద్యార్థిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు దర్యాప్తులో తేలింది. ఈ నరబలికి సంబంధించి పాఠశాల యజమాని జశోధన్ సింగ్, అతడి కుమారుడు, స్కూల్ డైరెక్టర్‌ దినేష్ బాఘేల్, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ సింగ్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు రామ్ ప్రకాష్ సోలంకి, వీర్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.


Similar News