Assam : అసోంలో బాంబుల కలకలం.. రెండు ఐఈడీ మెటీరియల్స్ లభ్యం

దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవాల వేళ అసోంలో పేలుళ్లకు నిషేధిత తిరుగుబాటు సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం- ఇండిపెండెంట్’ (ఉల్ఫా-ఐ) కుట్ర పన్నింది.

Update: 2024-08-15 14:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవాల వేళ అసోంలో పేలుళ్లకు నిషేధిత తిరుగుబాటు సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం- ఇండిపెండెంట్’ (ఉల్ఫా-ఐ) కుట్ర పన్నింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థే గురువారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల బాంబులను పెట్టామని, సాంకేతిక వైఫల్యం వల్ల వాటిని పేల్చలేకపోయామని వెల్లడించింది. ప్రజల ప్రయోజనార్ధం వాటిని నిర్వీర్యం చేయాలని ఉల్ఫా-ఐ కోరింది. ఈమేరకు పలు అసోం మీడియా సంస్థలకు ఆ సంస్థ ఒక సంచలన ఈమెయిల్‌ను పంపింది. బాంబులు పెట్టిన 19 ప్రదేశాల సమాచారాన్ని వెల్లడించిన ఉల్ఫా-ఐ, మిగతా ఐదు ప్రదేశాల సమాచారం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పోలీసు విభాగం, భద్రతా బలగాలు హైఅలర్ట్ అయిపోయి, ప్రధాన నగరాల్లోని జనసమ్మర్ధ ప్రదేశాల్లో ముమ్మర సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

ఈమెయిల్‌లో ఉల్ఫా-ఐ ప్రస్తావించిన 19 లొకేషన్లలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, మెటల్ డిటెక్టర్స్, స్నైఫర్ డాగ్స్‌తో తనిఖీలు నిర్వహించారు. అయితే ఆయాచోట్ల బాంబులు దొరకలేదు. కేవలం గువహటిలోని పాన్ బజార్, గాంధీ బస్తీలలో రెండు ఐఈడీ లాంటి మెటీరియల్స్‌ను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఉల్ఫా-ఐ ప్రకటించిన లొకేషన్లలో 8 గువహటిలోనే ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ లిస్టులో దిస్పూర్‌లోని అసోం సీఎం హిమంత బిస్వశర్మ, పలువురు మంత్రుల అధికారిక నివాసాలకు సమీపంలోని ఒక పొలం కూడా ఉందని తెలిపాయి. అయితే అక్కడ బాంబులేవీ దొరకలేదని స్పష్టంచేశాయి.

Tags:    

Similar News