Global warming: భూమి నుంచి వెలువడుతున్న విష వాయువు..! భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉందా?

Global warming: భూమి నుంచి వెలువడుతున్న విష వాయువు..! భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉందా?

Update: 2024-10-08 07:26 GMT

దిశ, ఫీచర్స్ : పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం వంటివి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయా?.. మానవాళికి ప్రమాదం పొంచి ఉందా?.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం ఉందని చెప్తున్నారు. గత దశాబ్దాల కాలంలో భూమి చుట్టూ అతినీల లోహితర కిరణాల నుంచి రక్షణ కవచంగా పనిచేస్తోన్న ఓజోన్ పొర గ్రీన్ హౌస్ వాయువుల వల్ల దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనినే గ్లోబల్ వార్మింగ్ అని, భూమి వేడెక్కడం అని నిపుణులు పేర్కొంటున్నారు.

నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులను ‘గ్రీన్ హౌస్’ వాయువులు అంటారు. ప్రస్తుతం భూ వాతావరణంలో ఇవి పెరిగిపోతున్నాయి. నివారణ చర్యలు పాటించకపోతే భవిష్యత్తులో ఈ భూమికి ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు వారు సముద్ర ఉపరితలం నుంచి ఒక శిలాజాన్ని తవ్వి, డైనోసర్ల కాలంలో ప్రపంచం ఎలా వేడెక్కిందో, అప్పటి పరిణామాలు ఎలా ప్రభావితం చేశాయో మరోసారి విశ్లేషించారు. అలాగే భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు.

గ్లోబల్ వార్మింగ్, భూతాపం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు భూమి నుంచి వెలువడే గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం తగ్గకపోతే భవిష్యత్‌లో మానవాళికి ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచం ‘హాట్ హౌస్, ‘వార్మ్ హౌస్, కూల్ హౌస్, ఐస్ హౌస్’ వంటి మొత్తం 4 రకాల వాతావరణ మార్పులను చవి చూసిందని గర్తు చేశారు. ఇంతకాలం భూమి ఐస్ హౌస్ పొరలో ఉండేదని, ప్రస్తుతం దీనిపై గ్రీన్ హౌస్ వాయువల ప్రభావం విపరీతంగా పడుతోందని చెప్తున్నారు.

భూమి వేడెక్కడానికి, గ్రీన్ హౌస్ వంటి విష వాయువులు వెలువడటానికి మానవ కార్యకలాపాలే కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత దశాబ్దంలో బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడంవల్ల కార్బన్ డయాక్సైడ్ గాఢత మరింత పెరిగింది. ప్రస్తుతం భూమి నుంచి గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదలకు కూడా అదే కారణం అవుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదే కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో మానవాళి తీవ్రమైన పర్యావరణ సమస్యలను, మనుగడ ముప్పును ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు. 


Similar News