పెండ్లి సాయం కోసం ఎదురుచూపులు

దిశ, తెలంగాణ బ్యూరో: పెండ్లి చేసుకుని మూడు నెలలైనా ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూడక తప్పడం లేదు. రాష్ట్రంలో పేద ముస్లీం యువతుల వివాహాలకు ప్రభుత్వం అందించే షాదీ ముబారక్ పథకంలో వచ్చిన దరఖాస్తుల్లో ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన నాటి నుంచి ఒక్కరికి కూడా లబ్ది చేకూరలేదు. ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోగా.. రాష్ట్రవ్యాప్తంగా 23 వేలకుపైగా లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పేద ముస్లీం కుటుంబాలకు అండగా నిలిచి […]

Update: 2021-06-06 14:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెండ్లి చేసుకుని మూడు నెలలైనా ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూడక తప్పడం లేదు. రాష్ట్రంలో పేద ముస్లీం యువతుల వివాహాలకు ప్రభుత్వం అందించే షాదీ ముబారక్ పథకంలో వచ్చిన దరఖాస్తుల్లో ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన నాటి నుంచి ఒక్కరికి కూడా లబ్ది చేకూరలేదు. ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయకపోగా.. రాష్ట్రవ్యాప్తంగా 23 వేలకుపైగా లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పేద ముస్లీం కుటుంబాలకు అండగా నిలిచి యువతుల వివాహ సమయంలో షాదీ ముబారక్ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2014లో రూ.50 వేలతో ప్రారంభమైన ఈ పథకంలో ప్రస్తుతం రూ. లక్షా నూట పదహారు ప్రభుత్వం ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా షాదీ ముబారక్ పథకం అందలేదు.

హైదరాబాద్‌లో అత్యధికంగా 9,331 దరఖాస్తులు రాగా.. మేడ్చల్ – మల్కాజిగిరిలో 1,517, నిజామాబాద్ లో 2,027, రంగారెడ్డిలో 2,089, సంగారెడ్డిలో 1,128, వికరాబాద్‌లో 688 మంది దరఖాస్తులు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,854 మంది షాదీ ముబారక్ పథకం కోసం తమ దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్నాయి. పెండ్లి పత్రిక, ఆధార్ కార్డులు, కుల, ఆదాయ, వయసు ధృవీకరణ పత్రాలతో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్న లబ్దిదారులకు పెండ్లయిన నాటి నుంచి నెల రోజుల్లో ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెల నుంచి ఒక్కరికి కూడా షాదీ ముబారక్ అందకపోవడం గమనార్హం.

నిధులు విడుదల లేదు.. వచ్చినా జమ కాలేదు

షాదీ ముబారక్ పథకం లబ్దిదారుల కోసం ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్ లో రూ.300 కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటివరకు కేవలం రూ.75 కోట్లను మాత్రమే మంజూరు చేసింది. 2020–21 ఏడాదిలోనూ రూ.300 కోట్లను కేటాయించి, పూర్తిగా ఖర్చు చేసినట్టు ప్రభుత్వం గణంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత దరఖాస్తుల ప్రకారం అందరికీ షాదీ ముబారక్ చేరాలంటే రూ.238.81 కోట్లను ఇప్పటికే ఆర్డీఓలకు విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన నిధులను కనీసం ఏడు వేల మందికైనా ఈ ప్రయోజనాన్ని అందించవచ్చు. లాక్ డౌన్, కరోనా కారణాలంటూ లబ్దిదారులకు అధికారులకు సమాధానం చెబుతూ దాట వేస్తున్నారు. ప్రభుత్వ సాయం ఉంటుందని నమ్మకంతో అప్పులు తెచ్చి పెండ్లిండ్లు చేసిన వారికి వడ్డీ భారం తప్పడం లేదు. నెల రోజుల్లోపే రావాల్సిన షాదీ ముబారక్ డబ్బులు మూడు నెలలైనా రాలేదు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారికి సరిపడా నిధులను కూడా ప్రభుత్వం కేటాయించడం లేదు. దీంతో ఇంకెన్ని రోజులు ఈ పథకం కోసం లబ్దిదారులు ఎదురుచూడాల్సి వస్తుందోనని ఆలోచనలో పడ్డారు. పథకం కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో స్క్రూటనీ చేసి లబ్దిదారులను ఫైనలైజ్ చేసినప్పటికీ ప్రభుత్వ సాయం చేరడం లేదు. ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగనందునే డబ్బులను రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News