జయాపజయాలు జనాధీనమా.. ధనాధీనమా..?

Will democracy win this election? Does money win?

Update: 2024-05-11 01:00 GMT

బహుళ పార్టీ ప్రజాస్వామ్య విధానంలో ప్రజా సమస్యలు ఎన్నికల ఎజెండాగా మారడం లేదు. భావోద్వేగాలు, ప్రలోభాల మాటున ప్రజా సమస్యలు కనుమరుగవుతున్నాయి. ప్రజాస్వామ్య ఎన్నికల్లో జయాపజయాలు జనాధీనం అనేది పాత మాట. నేడు ధనాధీనం అనేది సరికొత్త పాటగా మారింది. జనం చైతన్యంతో ప్రలోభాలు, ఉచితాలు, తాయిలాల వలలో పడకుండా ప్రాధాన్యాల ప్రాతిపదికన ఏ పార్టీకి ఓట్లు వేయాలో వారికి వేస్తే గెలుపు ప్రజలది అవుతుంది. భావోద్వేగాలదో, ప్రలోభాలదో పైచేయి అయితే ప్రజాస్వామ్యం ఓడిపోతుంది.

మన దేశ, రాష్ట్ర పౌరుల ఆకాంక్షలు, ఆశయాలకు ప్రాతినిథ్యం వహించే బాధ్యతాయుత ప్రజాస్వామ్య సాధనాలు రాజకీయ పార్టీలు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే బాధ్యతాయుత అధికారపక్షం.. అలాగే ప్రభుత్వాల పెడధోరణులను కట్టడి చేసి ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించగల ప్రతిపక్షం.. ఈ రెండూ ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఈ సున్నితమైన సమతూకం దెబ్బతింటే! ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాలు గతి తప్పి అప్రజాస్వామికంగా, అనైతికంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చే రాజకీయ దూషణలతో ఏకస్వామ్యంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం.  ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో క్రమేపి విశ్వసనీయత సన్నగిల్లిపోతుంది. తద్వారా ప్రజలు ఓటింగ్‌కు ప్రజలు దూరం అవుతారు. ఇది భిన్నత్వంలో ఏకత్వ సాధన కోసం ఏర్పడిన మన ప్రజాస్వామ్య దేశానికి క్షేమం కాదు.

30 కోట్ల మంది ఓటు వేయలే..!

తొలి సార్వత్రిక ఎన్నికల్లో (1951-52) మనదేశంలో ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. గడిచిన ఏడున్నర దశాబ్దాలలో ఏకంగా ఐదున్నర రెట్లు పెరిగిపోయి నేడు 97 కోట్ల మంది ఓటర్లుగా నమోదైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే, ఓటర్లు పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం నిరాశాజనకంగానే ఉంటుంది. 2019లో లోకసభ ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. వారిలో వలస కూలీలు, పట్టణ నగర వాసులు, యువత అధికంగా ఉన్నారు. దీని మూలంగా గత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.40 శాతం మాత్రమే పోలింగ్ అయ్యింది. 50 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జాతీయ సగటు కన్నా తక్కువగా ఓట్లు పోలయ్యాయి. మన రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి అలాగే మహారాష్ట్రలోని పూణే, కళ్యాణ్ వంటి చోట్ల కనీసం 50% ఓటర్లైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కాలేదు. ఇలా గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన 266 లోకసభ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పుడు ప్రత్యేక కార్యాచరణతో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రజల్లో అవగాహన, ప్రచారంపై దృష్టి సారించింది. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినా ఓటింగ్ శాతం తగ్గుతుందంటే లోపం ఎక్కడుంది?

ఓటింగ్ శాతం పెంచండి!

దేశంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై యువతకు సరైన అవగాహన కొరవడుతుంది. పాఠశాల, కళాశాల స్థాయి నుండి ఓటు హక్కు పై అవగాహన పరుస్తూ నవతరాన్ని పోలింగ్ కేంద్రాల వరకు రప్పించాలి. అర్హులైన ఓటర్లను తొలగిస్తున్న రాజకీయ పార్టీల విధానాలను కట్టడి చేయాలి. ఇలా ఎన్నికల్లో అక్రమాలను కట్టడి చేస్తూ రాజకీయ పార్టీలు నైతిక విలువలకు కట్టుబడేలా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాలి. ఈ ఎన్నికల్లో ప్రలోభాలో, భావోద్వేగాలో కాకుండా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మారితేనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా ప్రజలే అంతిమ విజేతలౌతారు. మన్నికైన పార్టీని నాయకున్ని ఎన్నుకున్న నాడే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటాడు. వారే దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు పరుస్తారు. ప్రజల బాధలు తీరుస్తారు. వారు మాట తప్పితే.. ఇంటికి పంపేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు వజ్రాయుధం ఎట్లాగూ ఉండనే ఉంది. పార్టీల నేతలారా మారండి!. ప్రజలారా ఓటింగ్ శాతాన్ని పెంచండి. ఇది ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు..

మేకిరి దామోదర్,

సామాజిక విశ్లేషకులు,

95736 66650

Tags:    

Similar News