మళ్లీ నోబెల్ వెలుగులు ఎప్పుడు..?

గణన ఎలా చేయాలో నేర్పించిన భారతీయులకు మనం చాలా రుణపడి ఉంటాం, అది లేకుండా విలువైన శాస్త్రీయ ఆవిష్కరణ జరగలేదు". ఈ అనంత విశ్వానికి, 'సున్నా'

Update: 2024-10-12 01:00 GMT

గణన ఎలా చేయాలో నేర్పించిన భారతీయులకు మనం చాలా రుణపడి ఉంటాం, అది లేకుండా విలువైన శాస్త్రీయ ఆవిష్కరణ జరగలేదు". ఈ అనంత విశ్వానికి, 'సున్నా'ను అందించిన భారతీయుల గురించి ఈ శతాబ్దపు అత్యున్నత ప్రభావిత వ్యక్తుల్లో ఒకరైన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అన్న మాటలివి. ఎన్నో శతాబ్దాల క్రిందటే ప్రపంచ విజ్ఞానానికి గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, రసాయన శాస్త్రాల్లో మన శాస్త్రవేత్తలు చేసిన కృషి నేటి ఆధునిక సైన్స్‌కు పునాదిగా నిలిచింది. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, వరాహమిహిర, భాస్కర, పతంజలి, చరక, సుసృత, భరద్వాజ తదితరుల వంటి విఖ్యాత శాస్త్రవేత్తల మేధస్సు ప్రపంచపు పరిజ్ఞానాన్ని ప్రభావితం చేసింది.

మనకు స్వాతంత్ర్యం రాకముందే బ్రిటిష్ వారి క్రింద బానిసత్వపు పాలన కాలంలోనే ఆసియా ఖండంలోనే సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్, భౌతికశాస్త్రంలో సి.వి రామన్ వంటి మహానుభావులు తొలి నోబెల్ సాధించి భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియజెప్పారు.

ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ..

నేడు జనాభాలోనే అగ్రస్థానంలో వుంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తూ, శతాబ్దాల నాగరికతను కలిగివున్న భారతదేశం నుంచి ఫిజిక్స్‌లో, సాహిత్యంలో 78 సంవత్సరాలుగా మనం నోబెల్ బహుమతి గెలవలేకపోయామంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరముంది. ప్రతిభకు అత్యుత్తమ కొలమానం నోబెల్ బహుమతి కానప్పటికీ, నోబెల్ కమిటీలపై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు వున్నప్పటికీ నోబెల్ బహుమతుల విలువను ప్రపంచం "విశ్వ విజేత స్థాయి"గానే చూస్తుందనడం మనం కాదనలేని సత్యం.

మన నోబెల్ పాత ఘనతేనా?

"నా మతం సైన్స్. నేను దాన్నే ఆరాధిస్తాను. నిత్య సాధకులైన వారే నా వారసులు"అంటూ కేవలం ₹200ల విలువైన పరికరాల సాయంతో రామన్ ఎఫెక్ట్‌ను కనుగొని 1930లో మనకు ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అందించారు సి.వి రామన్. 1943లో తానే సొంతంగా బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్థాపించి మన దేశంలోనే విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, అబ్దుల్ కలాం వంటి మహామహులకు దిక్సూచిగా నిలిచారు. నేటి ఆధునిక ప్రపంచం సైతం ఇంకా "రామన్ ఎఫెక్ట్'కు ప్రభావితం అవుతూనే వుంటూ ఎన్నో ప్రకృతి రహస్యాలను చేధిస్తోంది. సి.వి రామన్ బంధువు అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. భారతీయ-అమెరికన్‌గా నక్షత్రాల పరిణామంపై పరిశోధనలు చేసి చంద్రశేఖర్ లిమిట్‌తో ఖ్యాతి గడించారు. బ్లాక్ హోల్స్‌పై వీరి పరిశోధనాంశాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీరి కృషికి గుర్తింపుగా 1983 లో విలియం ఎ.ఫౌలర్ తో కలిసి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. వీరిలాగే మదర్ థెరిస్సా, హరగోవింద్ ఖొరానా, అమర్త్యసేన్, వెంకట్రామన్ రామకృష్ణన్ వంటి వారు మన దేశ మూలాలు కలిగిన నోబెల్ విజేతలు. 2014లో మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి ప్రఖ్యాత భారతీయ బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి మన దేశ పౌరసత్వంతో నోబెల్ శాంతి బహుమతి గెలిచారు.గాంధీజీ నుంచి ప్రేరణ పొందిన వీరు "బచ్ పన్ బచావో ఆందోళన్" వంటి ఎన్నో కార్యక్రమాలతో బాలకార్మిక వ్యవస్థ పై,విద్యా వ్యవస్థపై ఎన్నో ఉద్యమాలు చేశారు. లక్షలాది పిల్లల జీవితాలను మార్చారు.

నోబెల్ ఇక మనం సాధించలేమా?

ఏడు దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పరిశోధనలు, ఫలితాలు ప్రపంచ స్థాయిలో లేకపోవడమే నోబెల్‌లో నేటి మన ప్రదర్శనకు ప్రధాన కారణం. అంతరిక్ష పరిశోధనల్లో మంగళయాన్, చంద్రయాన్ వంటి అద్భుత ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మాట వాస్తవం. కానీ ఇంకా మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలి. విశ్వవిద్యాలయాల స్థాయి ఉన్నత విద్యలో, పరిశోధనల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. బడ్జెట్ పెంచాలి. యువతరాన్ని పరిశోధనల వైపు ప్రోత్సహించాలి. ఫెలో షిప్స్ అమౌంట్ పెంచాలి. నేటి తరపు చదువులు మార్కులు, ఉద్యోగం, సంపాదన చుట్టే తిరుగుతున్నాయి. ఆ దృక్పథాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు మార్చుకొని, శాస్త్రవేత్తలకు సరైన గుర్తింపు మనదేశంలో ఇవ్వాలి. విదేశాలకు వెళ్లే శాస్త్రవేత్తల వలసలను ఆపాలి. ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి నూతన చట్టాలతో కృషి చేయాలి.

తరగతి గదుల్లోనే భారత రత్నాలు..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని, యువతను పెద్ద పెద్ద కలలు కనమని యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన అబ్దుల్ కలాం జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి. మన తరగతి గదుల్లో శ్రీనివాస రామానుజన్ వంటి అసాధారణ భారతరత్నాలు ఉదయించాలి. త్వరలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, సి.వి రామన్ వంటి మహానుభావుల స్ఫూర్తితో మళ్లీ మనదేశం ప్రపంచానికి నోబెల్ వెలుగులతో అనంత విశ్వం దాకా అన్వేషణ కొనసాగాలని ఆశిద్దాం. జగదీశ్ చంద్రబోస్, సలీం అలీ, సి.యస్.ఆర్ రావు, కల్పనా చావ్లా, బిమ్లా బూటి వంటి మన శాస్త్రవేత్తలు నేటి తరాలకు గొప్ప హీరోలుగా పరిచయం చేస్తూ గౌరవిద్దాం. నవతరం వినూత్న ఆవిష్కరణలతో విదేశీ గడ్డలపై మన జాతీయ పతాకాన్ని ఎగిరేలా మన ప్రయాణం, మన ప్రయత్నం కొనసాగిద్దాం.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News