వరదల్లో పార్టీల సమిష్టి బాధ్యత ఏది!

తెలుగు రాష్ట్రాల్లో నింగి నేల ఏకం చేసేలా కురిసిన కుండపోత వర్షం ప్రజలను బయట అడుగుపెట్టనివ్వలేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్లు

Update: 2024-09-10 00:45 GMT


తెలుగు రాష్ట్రాల్లో నింగి నేల ఏకం చేసేలా కురిసిన కుండపోత వర్షం ప్రజలను బయట అడుగుపెట్టనివ్వలేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్లు లేవు. ఈవరదలతో రోడ్లు, వంతెనలు, చెరువులు, ఆరుగాలం శ్రమించిన పంటలు, ఆస్తి నష్టంతో జనజీవనం ఛిద్రమైపోయింది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల సంబంధాలు తెగిపోయాయి. జలప్రళయ బీభత్సంతో రెండు రాష్ట్రాల్లోని వరద ప్రాంతాల బాధిత జనం కట్టుబట్టలతో బిక్కుబిక్కు మంటూ ప్రాణభయంతో రక్షణ శిబిరాలకు తరలారు. ఆ ప్రజల కష్టాలు, పాట్లు మాటలకందనంత హృదయ విషాదకరంగా ఉన్నాయి. 

ఈ విలయతాండవం మూలంగా రెక్కాడితే డొక్కాడని పేదలు, చిన్న, సన్న కారు, మధ్యతరగతి వారు, ప్రధానంగా అన్నదాతలకు పంట నష్టం, ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం జరగడంతో బోరున విలపిస్తున్నారు. ఇలా మరెందరినో దారుణంగా కోలుకోని దెబ్బతీసింది. బాధితులను ఆదుకోవడంలో రెండు రాష్ట్రాల సర్కారీ యంత్రాంగం నిద్రాహారాలు మాని చెమటోడ్చి పని చేస్తోంది. అంతవరకు బాధితులకు బాసటగా నిలవడం జాతి సమిష్టి బాధ్యత. కానీ స్వార్థశక్తులు శవాల మీద పేలాలేరుకునే దౌర్భాగ్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒకరిపై ఒకరు అనుచిత విమర్శలు, వెటకారాలు, అవహేళన కౌగిలిలో మానవ త్వం నలిగిపోతోంది. నాడు గల్లీ గల్లీ తిరిగి ఓట్ల కోసం భిక్షాటన చేసిన పార్టీలు, నాయకులు ప్రజలు కష్టకాలంలో ఉన్నవేళ వరద బాధి తుల వైపు కన్నెత్తి చూడని తీరు అమానుషం.

పొలిటికల్ మైలేజ్ ఇప్పుడా?

జాతి మొత్తంగా వరద బాధితులకు తోడ్పడాల్సిన సందర్భంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పాల్పడడం దారుణం. పొలిటికల్ మైలేజీ ఎన్నికల వేళ చేయాలి. ఈ విషా ద కాలంలో బాసటగా నిలవాలి. ప్రభు త్వాలు ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలి. పాలకుల లోటుపాట్లను సద్విమర్శ చేయాలి. విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకోరాదు. పట్టణాలు, నగరాల్లోని చెరువులు, కుంటలు, నాలాలు, వరద నీరు నిల్వ ఉండే జల వనరులను దురాక్రమణ చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారు, వారికి సహకరించిన గత పాలకుల మూలంగానే ఈ విపత్కర పరిస్థితి దాపురించింది. దీంతో వరద నీరు వెళ్లే దారి లేక నగరాలు, పట్టణాలు, జన ఆవాసాల్లోకి చేరి విధ్వంసం సృష్టించింది. పాలకులు బాధితులను ఆదుకుంటున్నారు.. వరద బాధితులకు సాయం అందించేందుకు కేంద్రం, పాలక, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలన్నీ సమిష్టి బాధ్యతతో మానవత్వం చాటాలి.

సాయపడిన చేతులకు నమస్సులు..

ఈ ఆపత్కాలంలో స్పందించి ఒక్కరోజు వేతనాన్ని మానవత్వంతో సాయంగా ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం, సినిమా ప్రముఖులు, కొందరు నాయకులు, శక్తి మేరకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. కానీ రాజకీయ పార్టీలను, నాయకులను, దురాక్రమణ దారులను ఈ విపత్తు కదిలించలేదు. రాజకీయ పార్టీలు, నాయకు లు సేవ పేరుతో అధికారంలోకి వచ్చిన వారు, ఆకాశాహర్మ్యాల్లో విలాసవంతంగా జీవిస్తున్న వారిలో సామాజిక బాధ్యత, స్పృహ కానరావడం లేదు. ఆ సంపద ఎవరిది? ఈ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం కాదా!. మీరు ఎవరూ సాయం చేయరా? స్వాతంత్ర్యానంతర పాలనలో అవినీతి పెరిగిపోయి, ఆర్థిక అసమానతల అగాధం పూడ్చలేని స్థాయికి వెళుతుంది. పాలనా వ్యవస్థ కుళ్లిపోతుంది. అలాంటి పరిణామాల మూలంగానే ఆ మధ్య శ్రీలంకలో, మొన్న బంగ్లా దేశ్‌లో తిరుగుబాటు పరిస్థితులు చూశాం. పాలకులారా మారండి జాతి సంపదను సమంగా పంచండి..

ఇంకెప్పుడు సహాయపడతారు!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు పెట్టుకొని సేవపేరుతో, వంతుల వారీగా ఇన్నాళ్లు అధికారం చెలాయించింది ఎవరిని ఉద్ధరించడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప!. పార్టీలు, నాయకులు ఎన్నికల ముం దు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చేసిన కోట్ల రూపాయల చందాల దందా మరిచారా? ఇం దులో అన్ని పార్టీలు ఉన్నాయి. రెండు కమ్యూ నిస్టు పార్టీలు తప్ప. ఏఒక్క పార్టీ కానీ, ప్రధాన నాయకులు గాని అన్నమో రామ చంద్రా అని తల్లడిల్లిస్తున్న బాధిత ప్రజల కోసం సాయం చేయరా? ఈ ఆపద కన్నా పెద్ద విపత్తు ఏముంది? ఓట్ల నాడు ఇల్లు ఇల్లు తిరిగి కడుపులో తలపెట్టి, పొర్లు దం డాలు పెట్టి ఓట్లు వేయించుకున్న విషయం మరిచారా? నేడు ప్రజలు కష్టాల్లో ఉంటే తక్షణమే స్పందించి ఆదుకోవాల్సిన వేళ మీన మేషాలు లెక్కిస్తూ, నివేదికలు రావాలంటూ పరామర్శలు, ప్రవచనాలు వల్లిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలు బాధ్యులే, బాధితుల పక్షాన నిలబడాల్సిన చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు. స్వార్థంతో ఓటు బ్యాంకు, బురద రాజకీయాలు మానండి.. మానవత్వం చాటండి. తాత్కాలిక సాయం కాకుండా బాధితులు నిలదొక్కుకునేలా అం దించాలి. దురాక్రమణ దారుల నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచిన ప్రత్యేక హైడ్రాను రెండు రాష్ట్రాల తో పాటు జిల్లా కేంద్రాలకు విస్తరించి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇన్నాళ్ల తిలా పాపం తలా పిడికెడు నుంచి విముక్తి కోసమైనా పార్టీలు, నాయకులు మద్దతు ఇచ్చి ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా చూడడమే తక్షణ కర్తవ్యం. అలా కాని పక్షంలో ఆపత్కాలంలో తల్లడిల్లుతున్న ప్రజల ఓపిక శృతిమించితే తట్టుకోలేరు..

- మేకిరి దామోదర్

95736 66650

Tags:    

Similar News