మనమెంత అంధకారంలో ఉన్నామో..!

ఇటీవల నాకు పంటి సమస్య రావడంతో నగరంలోని ఒక ప్రముఖ దంత వైద్యశాలకు వెళ్లాను. అక్కడ పనిచేసే వైద్యుల్లో అందరూ యువతీ యువకులే.

Update: 2024-07-13 01:00 GMT

ఇటీవల నాకు పంటి సమస్య రావడంతో నగరంలోని ఒక ప్రముఖ దంత వైద్యశాలకు వెళ్లాను. అక్కడ పనిచేసే వైద్యుల్లో అందరూ యువతీ యువకులే. వీరిలో మెజారిటీ అమ్మాయిలే. అయితే విస్మయం కలిగించే విషయమేమంటే వీరందరు కుర్తా, పైజామా డ్రెస్సులే ధరించారు. ఈ మధ్య స్త్రీల ఎడమ కాలుకు ఒక నల్లటి దారాన్ని ధరించటం ప్యాషన్‌గా మారింది. దీనిని చిన్న పిల్లల నుండి ప్రౌఢల వరకు ధరించటం పరిపాటిగా మారింది. వీటిని ఎందుకు ధరిస్తున్నారు అని విచారించగా దిష్టి నివారించేందుకని తెలిసింది. ఈ దిష్టినే ఆంగ్లంలో evil eye అని అంటారు.

న్యూటన్ గమన నియమాల ప్రకారం..

దిష్టి అనేది భారతదేశంలో అనాది కాలం నుండి ప్రచారంలో వుంది. ఇది ఒక్క హిందూ మతంలోనే కాకుండా ముస్లిం, క్రిస్టియన్, యూదు మతంలో కూడా ఉంది. ప్రధానంగా కొందరి చూపు వేరే వారిపై పడితే వారికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని, మంత్రాలూ, తంత్రాలు చేస్తారని దానికి విరుగుడుగా తాయత్తులు, మంత్రాలు విరుగుడుగా వేయించటం మనం చూసివుంటాం. మరి నిజంగా దిష్టి, మంత్రాలు ఉంటాయా? వైద్యశాస్త్రం చదువుకొని వైద్యం చేస్తున్న డాక్టర్లు నల్ల దారం ఎడమ కాలుకు కట్టుకోడమేంటి? వీటిని పరిశీలించినప్పుడు మనమెంత అంధకారంలో ఉన్నామో తెలుస్తుంది.

1976లో భారత రాజ్యాంగానికి 46వ సవరణలో భాగంగా 51A ఆర్టికల్ ప్రకారం, పౌరుల్లో సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించటం ఫండమెంటల్ డ్యూటీగా పేర్కొనడం జరిగింది. కానీ నేడు చదువుకున్న వారే దిష్టి దారాలు, బాబాల దగ్గరికి పరుగెత్తటం చూస్తుంటే మన విద్యావిధానంలో తేడా వున్నట్టుగా గమనిస్తున్నాం. మనమందరం చదువుకొనే రోజుల్లో న్యూటన్‌ గమన నియమాల గురించి హైస్కూల్ స్థాయిలోనే నేర్చుకున్నాం. దీని ప్రకారం సృష్టిలో పదార్థాన్ని సృష్టించలేం, నాశనం చేయలేం. కాని ఒక రూపంలో నుండి వేరొక రూపంలోకి మారుతున్నదని నేర్చుకున్నాం. మరి ఈనాడు కొందరు బాబాలు తమ దగ్గర అద్వితీయ శక్తులు ఉన్నాయని హస్తలాఘవంతో చూపించటం.. వాటిని నమ్మి దేవునిగా భావించటం పరిపాటి. వారి బండారం బయటపడ్డప్పుడు కానీ వారి భక్తులకు కనువిప్పు కలగదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

చదువుకున్న వారు సైతం..

ఇటీవల హథ్రాస్‌లో భోలే బాబా సత్సాంగ్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక వందలమంది గాయపడటం మనం చూసాం. ఇందులో పాల్గొన్న భక్తులు మెజారిటీ నిమ్న కులాలకు చెందిన వారు కావటం గమనించాలి. ముఖ్యంగా మహిళలు, వారికున్న ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు ఆ బాబా నడిచిన అయన పాదదూళితో విముక్తులమవుతామనే అనే భావనలో ఉన్నవారు కావటం విశేషం. ఇంకా ఈ దేశ ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడటం, దీనికి ప్రధాన కారణం. ప్రచార సాధనాలు, పాలిత వర్గాల ప్రోత్సాహం ఇలాంటి దుష్టాంతాలకు కారణం. భోలే బాబా అవతారం ఎత్తకముందు అతని పేరు సురాజ్ పాల్. ఈయన పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి బాబా అవతారం ఎత్తాడు. గతంలో ఈయన చనిపోయిన బాలికను బతికిస్తానని స్మశానంలో హడావుడి చేసి జైలు పాలయ్యాడు. తర్వాత కాలంలో ఈయన ప్రభ బాబాగా వెలిగిపోయింది. ఇంతమంది చనిపోయినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. కారణం బాబా చేతిలోనున్న ఓట్ బ్యాంకు. పాలకులకు కావాల్సింది అధికారం తప్ప ప్రజా శ్రేయస్సు కాదని ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని ప్రచారం చేసినందుకు డా. దబోల్కర్, పన్సారే, గౌరీ లంకేశ్, కుల్బర్గ్ లాంటి యాక్టివిస్టులను హత్య చేశారు. డాక్టర్లు కాళ్లకు నల్ల దిష్టి దారాలను కట్టుకోవటం, చదువుకున్నవారు కూడా బాబాల మోసాలను నమ్మడం పైగా ప్రస్తుత వ్యవస్థ వీటికి బహుళ ప్రచారం కల్పించటం చూస్తే దేశం ఎటుపోతోందోననే ఆందోళన కలిగించక మానదు.

డా. కె.సుధాకర్ రెడ్డి

రిటైర్డ్ సీనియర్ లెక్చరర్,

89850 37713

Tags:    

Similar News