మేధావుల మౌనం నేరమే!

The silence of intellectuals is a crime!

Update: 2023-08-25 00:15 GMT

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నా, వారసత్వ సంపదని దోపిడీ చేస్తున్నా, రాష్ట్రం ఏమై పోతున్నా మేధావుల పాత్ర మౌనమేనా? మేధావుల మౌనమే పాలకుల దౌర్జన్యం. మేధావుల ప్రేక్షక పాత్రే పాలకుల అరాచకం. మేధావుల మౌనం రాష్ట్రాభివృద్ధికి శరాఘాతం. రాష్ట్ర ప్రయోజనాలు కోరుకొనే మేధావుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం వుంది. రాష్ట్ర ప్రయోజనాలు,ప్రజా ప్రయోజనాలు విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న పాలకులను మేధావులు ప్రశ్నించాల్సి వుంది. అసమర్థ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెగిన గాలిపటం చందం అయింది. అడ్డగోలు, అసంబద్ధ నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలు అయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా అంచుకు చేరింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరింది. పనుల కోసం పోటీ పడే కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడని దుస్థితి, సంపద పెంచకుండా అందిన కాడల్లా అప్పు చేసి సంక్షేమం పేరిట పంచడం సంక్షేమమో, ఆర్థిక అరాచకమో అర్థం కావడం లేదు.

పథకాలకూ అప్పులు పుట్టలే!

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కానీ, అధికారులు బాధ్యులు కారు. చేసిన అప్పులకు బాధ్యత తీసుకోవలసింది ప్రజలే. ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ఏ రాష్ట్రమైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పుడు అప్పులు తేనిదే పూట గడవని పరిస్థితి. జగన్‌ రెడ్డి అప్పులు చేస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు పట్ల విజ్ఞత ఉన్న వారెవరికైనా ఆందోళన కలుగుతుంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతున్నది. సంక్షేమ పథకాలతో ఉద్ధరిస్తున్నానని చెబుతున్నా ఆ సంక్షేమ పథకాలకు కూడా అప్పులు పుట్టని దుస్థితి ఏర్పడినా మేధావులు ప్రశ్నించరు. అట్లాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఏ గతి పట్టించారో మేధావులకు కనపడటం లేదా?

అమరావతిని పాడుబెట్టేశారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నారాజధాని కూడా లేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు కారణం ఎవరు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పైసా ఖర్చులేకుండా రైతులు వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని నిర్మించే మహత్తర అవకాశాన్ని కాలదన్ని దుష్ట తలంపులతో అమరావతిని పాడు బెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినా రాష్ట్రంలో వున్న మేధావులు ప్రశ్నించరా? ప్రశ్నించాల్సిన బాధ్యత మేధావులకు లేదా? అట్లాగే పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. రాష్ట్ర, ప్రజల భవిష్యత్ ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఆధార పడివుంది. అందుకే దీని నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గత ప్రభుత్వం పోలవరం సాకారం దిశగా నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తున్న తరుణంలో 2019 ఎన్నికలు జరిగి గత ప్రభుత్వం ఓడిపోయింది. పోలవరం మళ్ళీ బలి పీటమేక్కింది. అసమర్ధ పరిపాలనలో జరిగే నష్టమేంటో చెప్పడానికి పోలవరం ప్రాజెక్టు కేస్‌ స్టడీ వంటిది. పోలవరాన్ని నాశనం చేసి ప్రాజెక్టు నిర్మాణంపై చేతులెత్తేసిన వారిని మేధావులు ప్రశ్నించరా? తమది రాష్ట్ర ప్రయోజనాల పక్షమా లేక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నవారి పక్షమా అనేది మేధావులే తేల్చుకోవాలి.

హోదాని గాలికొదిలేశారు

నిద్ర లేచింది మొదలు పేదల జపం చేస్తూ,పేదలను ముందుపెట్టి రాజకీయాలు చేయడానికి అలవాటు పడిన వారు ఆచరణలో చేస్తున్నది ఏమిటి? సంక్షేమ పథకాల పేరిట ఈ నాలుగున్నరేళ్లలో మహా అయితే ఒక్కో కుటుంబానికి లక్షకు పైగా పంచి పెట్టి ఉంటారు. అందుకోసం రూ 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి సోకాల్డ్‌ సంక్షేమ పథకాలకు ప్రచారం పేరిట తన సొంత మీడియా సంస్థలకు ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ 500 కోట్ల రూపాయలను దోచి పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి కూడా పేదలకు ఇచ్చింది లక్షకు పైగా మాత్రమే ఇచ్చిన జగన్ రెడ్డి, తన సొంత మీడియా వ్యవస్థలకు మళ్లించింది మాత్రం రూ 500 కోట్ల రూపాయలు. ఇంత కంటే మోసం దగా ఉంటుందా? ఇటువంటి దారుణాలపై మేధావులు ఎప్పుడన్నా ప్రశ్నించారా? పాలకుల కపటత్వాన్ని కొందరు మేధావులు ఎందుకు ప్రశ్నించరు? 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికితే నిజమనుకున్నప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. అయినా హోదా గురించి మర్చిపోయిన వారికి ఆ విషయం గుర్తు చేయడానికి ఒక్క మేధావి కూడా సాహసం చేయ్యరా? మహిళల భద్రతా నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కళ్ళకు కడుతున్నా, మహిళల పట్ల మానవ మృగాలు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నా ఆడపిల్లలకు భద్రత ఎక్కడ అని ఏ ఒక్క మేధావి ప్రశ్నించరు.

అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆ పని చెయ్యకపోగా 8 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై రూ 50 వేల కోట్లకు పైగా భారం వేసి నడ్డి విరుస్తున్నా ఒక్క మేధావి ప్రశ్నించరు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోయినా ఒక్క మేధావి మాట్లాడరు. ఎందుకంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల కంటే వారిపై ఉన్న కేసుల నుంచి బయటపడటం ముఖ్యమైనదిగా మేధావులు భావిస్తున్నారేమో! సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారు ప్రస్తుతం తాగే మద్యాన్నే కాకుండా భవిష్యత్‌లో తాగబోయే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నా, కల్తీ మద్యం అమ్ముతూ మందు బాబుల ఆస్తులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నా, మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మరీ ఆదాయం పెంచుకుంటున్నా, మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు పోగేసుకొంటున్నా, మద్య నిషేధం అమలుకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం అయినా ఏ ఒక్క మేధావి మాట్లాడరు. సమస్త పన్నులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదల బతుకు చిద్రమవుతున్నా ఒక్క మేధావి ప్రశ్నించరు.

అన్యాయంపై గళం విప్పాల్సిందే

రాష్ట్రంలో రోడ్లు సర్వనాశనం అయి మోకాళ్ళ లోతు గుంతలు పడి రహదారులు నరకానికి కేరాఫ్‌గా మారినా రోడ్లు బాగా లేవని, రోడ్లు బాగు చేయమని గాని, దారుణమైన రోడ్ల పరిస్థితి గురించి కానీ ఒక్క మేధావి ప్రశ్నించరు. ప్రభుత్వ పనితీరు రాష్ట్రంలో అధ్వాన్న స్థితికి అద్దం పడుతుంది. ప్రజలు నమ్మి అధికారం అప్పగించినందుకు రాష్ట్రం కోల్పోయింది ఏమిటో మేధావులు గుర్తించడం లేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు తెరవాల్సిన మేధావులు మౌనంగా ఉండటం ఏమిటి? కొందరు కుహనా మేధావుల సంఖ్య పెరిగిపోతుంది. వారు ప్రవచించే నీతుల కింద నిజం కప్పబడి పోయింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం జరగనిది, జరిగినట్లు, చెడును మంచిగా చెప్పడం వల్ల సమాజానికి ఎంత చేటుచేస్తున్నారో వారే అర్థం చేసుకోవాలి. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పడానికి మేధావులు ముందుకు రాకపోతే ప్రజలకు నష్టం చేసినవారు అవుతారు. ఉగ్రవాదులు వల్ల వచ్చే ప్రమాదం కన్నా, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న మేధావుల వల్లనే ప్రమాదం పొంచి వున్నదని చెప్పక తప్పదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలు, సంఘటనలుపై ప్రజాస్వామ్య వాదులు, మేధావులు గళం విప్పాలి. సంఖ్యా బలంతో ప్రభుత్వం పార్లమెంటరీ సాంప్రదాయాలను, పద్ధతులను, చట్టాలను కాలరాసి ఇష్టానుసారం పాలన సాగిస్తున్నారు. కాబట్టి జనచైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రభుత్వం సక్రమమైన పాలన అందించనప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత, మేధావులదే. అరాచకం, అహంకారం, స్వార్ధం, అవినీతి, నియంతృత్వం పెరిగిపోయింది. ఇప్పటికైనా మేధావులు పాలకుల కపటత్వాన్ని ప్రశ్నించాలి.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Tags:    

Similar News