మహా ఎన్నికల పర్వం

దేశంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యాపరంగా రెండో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికల పర్వానికి తెరలేచింది. 403 శాసన సభాస్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌

Update: 2024-10-23 00:45 GMT

దేశంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యాపరంగా రెండో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికల పర్వానికి తెరలేచింది. 403 శాసన సభాస్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌ తర్వాత 288 స్థానాలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు రెండు ప్రధాన కూటముల మధ్య ఈ మహా యుద్ధం జరగనుండడం విశేషం. మహారాష్ట్ర ఎన్నికల పోరు ఈ ఏడాది అత్యంత ఉత్కంఠగా సాగనుంది. రాష్ట్ర రాజకీయాలు గత 5 సంవత్సరాలలో చాలా గందరగోళాన్ని చవిచూశాయి. మిత్రపక్షాలు రాజకీయ శత్రువులుగా మారడం, మధ్యలో విడిపోయిన పార్టీలు మారిన అధికార సమీకరణాలకు దారితీస్తున్నాయి. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి‌లకు ఈ ఎన్నికలు కీలకం. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు. మొత్తంగా ఆరు పార్టీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌), కాంగ్రెస్‌కు ఇది అగ్ని పరీక్షే. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి.

గత ఐదేళ్లలో ఎన్నో పరిణామాలు!

మహారాష్ట్ర రాజకీయాల్లో గడిచిన ఐదేళ్లలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, దశాబ్దాలుగా తమ పార్టీల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికారిక హోదాను దక్కించుకున్న ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లకూ కీలకంగా నిలవనున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు దక్కాయి. ఎన్సీపీ 44, కాంగ్రెస్‌ 54 సీట్లలో గెలిచాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల సిద్ధాంతపరంగా తన బద్ధ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టు కట్టింది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2022లో శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే అనూహ్యంగా పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టారు. కాషాయ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది ఎన్సీపీలోనూ చీలిక వచ్చింది. శరద్‌ పవార్‌తో విభేదించి అజిత్‌ పవార్‌ మహాయుతి కూటమిలో 40 మంది ఎమ్మెల్యేలతో చేరారు. ఉపముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల మహాకూటమి బలం ప్రస్తుతం 162 కాగా, మహావికాస్ అఘాడీ కూటమికి 105 సీట్ల బలం ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమవే అసలైన శివసేన, ఎన్సీపీ అని శిందే, అజిత్‌ పవార్‌ అసెంబ్లీలో నిరూపించుకున్నా, ప్రజా కోర్టులో ఎవరికి మద్దతుందనేది ఇప్పుడు తేలనుంది.

తేలిపోనున్న బలాబలాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహాయుతి, శివసేన (ఉద్ధవ్‌), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్‌పీ) ఆధ్వర్యంలోని మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) మధ్యే సాగనున్నాయి. రెండు కూటములు ఇంకా సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోలేదు. ఇరు కూటముల మధ్య రాజకీయ మైత్రి సంఖ్యా బలాబలాలు రాజకీయ, ప్రాంతీయ, సామా జిక సమీకరణాలు, వంటివి అత్యంత ఆసక్తిగా మారా యి. ఎన్సీపీ, శివసేనల్లో ఏర్పడిన చీలిక కారణంగా అరడజను మందికిపైగా కీలక నేతల భిన్నమైన రాజకీయాలు, మరాఠా కోటా ప్రకంపనలు, పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుని దూకుడు మీదున్న విపక్షం, గత ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు వంటివి ప్రస్తుత ఎన్నికలను శాసించనున్నాయి. 2022‌లో చీలిపోయిన శివసేన, ఏడాది కిందట ముక్కలైన ఎన్సీపీలు చెరో కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయా చీలిక పార్టీల బలాబలాలు తాజా ఎన్నికలతో తేలిపోతున్నాయి.

లోక్‌సభ ఫలితాలతో బీజేపీలో కలవరం

ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను మహాయుతి 17 స్థానాలకే పరిమితం కాగా, ఎంవీఏ మాత్రం 30 స్థానాలు దక్కించుకుని సత్తా చాటింది. ఈ పరిణామం సహజంగానే బీజేపీ నేతృత్వంలోని కూటమిని కలవరపెడుతోంది. లోక్‌సభ ఫలితాలు ఎంవీఏకి అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ మహాయుతిని ఓడించగలననే ఆశ, విశ్వాసాన్ని అందించాయి. కానీ హర్యానా ఎన్నికల ప్రకారం, లోక్ సభ విజయం రాష్ట్ర ఎన్నికల్లో విజయం గ్యారెంటీ కాదు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని వర్గాలను తమవైపు తిప్పుకునే పనిలో పడింది. ఇది హర్యానా బీజేపీ విజయగాథను ప్రతిబింబించగలదా? లేదా అనేది నవంబర్ 23న తేలనుంది.

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Tags:    

Similar News