కులగణనపై చర్చకు కారణం..

తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ కారణం.

Update: 2024-09-28 01:15 GMT

తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ కారణం. ఓ వైపు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీసీలను విస్మరిస్తూనే వస్తోంది. కానీ ఆయన మాత్రం బీసీలకు న్యాయం జరగాలంటూ పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉండడం మరింత ఆనందాన్ని ఇస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో అమలు చేయాలని బీసీ సంఘాలు గత కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. బీసీ గణాంకాలు, స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు కోసం చైర్మన్‌, ముగ్గురు సభ్యులతో కూడిన బీసీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉందని బీసీ నేతలు అంటున్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్‌ కమిషన్‌ సూచనలను కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి.

మోసపోతున్న బీసీలు..

తెలంగాణలో 23 శాతం బీసీ కోటా అమలు చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కొన్నివేల మంది బీసీలు సర్పంచ్‌ స్థానాలను కోల్పోయారు. మున్సిపాలిటీలు, గ్రేటర్‌ మున్సిపాలిటీల్లో మాత్రం బీసీ కోటా 34 శాతంగా అమలు అవుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని బీసీ కులాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల ముందు బీసీ కోటా 42 శాతానికి పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం లేదు కాబట్టి 42 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది.

చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం!

బీసీ రిజర్వేషన్లపై న్యాయ సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తూ వస్తోంది. బీజేపీ ప్రభుత్వం తమకు అవసరమైన అంశాల కోసం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ బీసీల అవసరం కోసం మాత్రం సిద్ధంగా ఉండదు. బీసీ తరగతుల ప్రజలు సామాజికంగా, విద్యాపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 15(4), 15(5),16(4) ప్రకారం బీసీ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. కానీ ఈ వెనుకబడిన తరగతులకు సరైన న్యాయం జరుగుతుందా? అనే విషయాన్ని ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బీసీలకు మోడీ వెన్నుపోటు..

మోడీ ప్రధాని అయిన తర్వాత 2019లో ఆధిపత్య కులాల పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ అమలులోకి తెచ్చారు. అలాంటి ఆయన అనుకుంటే బీసీలకు న్యాయం చేయలేరా? తాను బీసీ అంటూ చెప్పుకునే మోడీ మాత్రం బీసీలకు అండగా నిలబడటానికి ముందుకు రాకపోవడం వెన్నుపోటు పొడవడమే అవుతుంది. దేశంలోని 90 శాతం సంపదకు యజమానులుగా కొనసాగుతున్న ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం బీసీల కోసం మాత్రం అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. మోడీ నిజంగా బీసీ అయితే బీసీల సంక్షేమానికి శ్రీకారం చుట్టాలి. లేదంటే ఆయన పార్టీ రాజకీయ భవితవ్యాన్ని బీసీలు శాసించగలరు.

పార్టీలకతీతంగా పోరాడాలి!

బీసీ రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న పోట్లాటలు సరైనవేనా అనే ప్రశ్నలు కూడా వేసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి పోరాటం చేయాలి. పార్టీలు బీసీలను ఓట్లుగానే చూశాయి తప్ప రాజ్యాధికారంలో స్థానం ఇవ్వలేదు. తక్కువ శాతం ఉన్న వారే ఆ పదవులను అనుభవిస్తూ వస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రాతినిధ్యం పెరగాలంటే ఏమి చేయాలి అనే విషయమై ఆలోచించాలి. బీసీ కులాలన్నీ సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. రాష్ట్రంలో బీసీలకు మంచి జరుగుతుందనే ఆశ ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వాలు అనుకుంటే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం కష్టమేమీ కాదనే విషయాన్ని కూడా గుర్తించాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు సహా బీసీలకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుంటూ ఉంది. కానీ కాస్త వేగంగా ముందుకు వెళ్లాలని కోరుతూ ఉన్నాం. సమగ్ర కులగణన, రిజర్వేషన్ల పెంపునకు చట్టపరంగా ఉన్న సమస్యలపై సందేహాలను నివృత్తి చేయాలి.

రాహుల్ హామీని పార్టీ నెరవేర్చాలి!

పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ దేశంలో కులగణనను చేపట్టి తీరుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు. కులగణన లెక్కల ఆధారంగా ఆయా కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను తప్పకుండా అభినందించాల్సిందే. మరీ ముఖ్యంగా ఆయన మాటలను దేశ ప్రజలు నమ్మాలంటే మాత్రం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను తప్పక అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించడం శుభసూచకం. బీసీలకు అండగా ఉంటామంటూ ఆయన చెప్పిన మాటలు రాష్ట్రంలోని బీసీ నేతలకు ఊరట కలిగిస్తూ ఉన్నాయని మాత్రం చెప్పగలం.

దుండ్ర కుమార స్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Tags:    

Similar News