ప్రజాపాలన పరవశించాలి

prajapalana should prevail

Update: 2024-01-12 00:30 GMT

రాష్ట్రంలోని ప్రజల ఆశలను, గత ప్రభుత్వాల వైఫల్యాలను అస్త్రాలుగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి శ్వేతపత్రం విడుదల చేసి మరీ చెప్పింది ప్రస్తుత ప్రభుత్వం.

అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలుపరచాలని దృఢ నిశ్చయంతో ఉంది కొత్త ప్రభుత్వం. ఇప్పటికే వాటిని అమలు పరిచేందుకు అప్లికేషన్లను సైతం స్వీకరించింది. అయితే, వీటిని అమలు పరచడానికి అంత ఖజానా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందా? ప్రస్తుతం బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల కొత్త అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని ఆర్థిక నిపుణుల మాట.

వీటిని సరిచేసుకోవాలి..

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల ఉద్దేశ్యం ప్రజలకు మేలు చేసేదే.. కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం ఉండటంతో అక్కరకు రాని, అవసరం లేని ప్రయాణాలు ఎక్కువయ్యాయని తద్వారా బస్సులు సరిపోవడం లేదని ప్రజల్లో నిస్పృహ, నిరాశ మొదలైంది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేయాలి. గ్యాస్ ధర మాదిరే బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణం కాకుండా కనీసం సగం ధర టిక్కెట్టు గురించి ఆలోచించాలి. లేదా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి. అలాగే రైతు భరోసా పథకంలోనూ.. ఎకరానికి 15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు వరి పంటకు 500 బోనస్ ఉద్దేశ్యం మంచిదే కానీ.. వందల ఎకరాలున్న భూస్వాములకు ఈ పథకాన్ని కట్ చేసి చిన్న సన్నకారు రైతులకు అందించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇందిరమ్మ ఇండ్లల్లో సైతం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. అలాగే యువ వికాసం ద్వారా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ త్వరగా ఏర్పరచి యువకెరటాలని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని కోరుతున్నారు. అలాగే ఆరోగ్య మిషన్ ద్వారా గ్రామ గ్రామాన ప్రాథమిక వైద్యశాలలను బలోపేతం చేయాలి. ప్రజాసంక్షేమం కోసం ఇలా అన్ని పథకాలు కచ్చితంగా అమలు చేయాల్సిందే! అందుకు నిధులు ప్రభుత్వం సర్ధుతుందా? ఎక్కడి నుంచి సర్ధుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

వీటిని బలోపేతం చేస్తే చాలు..

ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 1.2 లక్షల కోట్లు అవసరం ఉంటుదన్నది నిపుణుల మాట. దీనికి అదనంగా రూ. 2 లక్షల రుణమాఫీ పథకం అమలు చేస్తే 20వేల కోట్లు అవసరమవుతాయి. అయితే 2022- 23 లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ఆదాయ వ్యయాలు రూ. 1.72 లక్షల కోట్లకు దాదాపు సమానం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. రాష్ట్ర ఖజానాలోని బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలు, జీతాలు పెన్షన్లకే పోతే రోడ్లు, వంతెనలు, పెద్ద ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాల పనుల కోసం మూలధన వ్యయం తీసుకోవడానికి ఖచ్చితంగా నిధులు ఉండవు. ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి.. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరాలి.. ఇవి జరగాలంటే విద్య, వైద్య, ఉద్యోగ రంగాలని బలోపేతం చేస్తే సగం గ్యారెంటీలు అమలు చేసినట్లేనని అనుభవజ్ఞుల మాట. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పరచిన కొన్ని రోజులకే.. పథకాల అమలులో అధికార పార్టీ విఫలమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం శోచనీయం.

డా. కృష్ణ సామల్ల

ప్రొఫెసర్

97058 90045

Tags:    

Similar News