కోయల ఇలవేల్పు జాతర..

Koyala Ilawelpu fair.. kommalamma jatara

Update: 2024-03-21 00:30 GMT

కోయల పండుగలు జాతర్లు ఎంతో విశిష్టంగాను విభిన్నంగానూ కనిపిస్తాయి. వారి సంస్కృతి సాంప్రదాయాలు జీవనశైలిని ఆచార శైలిని ప్రతిబింబిస్తాయి.

గోండుల జీవన విధానానికి అతి దగ్గరగా ఉండే కోయలను ఐదు వర్గాలుగా విభజించారు. ఒకటవ గట్టు గోత్రం, రెండవ గట్టు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు గోదావరి పరివాహక ప్రాంతమైన తెలుగు రాష్ట్రాలు మాత్రం మూడవ గట్టు గోత్రం కాకేటి పూజారి, వడ్డగోత్రం, నాలుగవ గోత్రం సనపగాని గోత్రం, ఐదవ గోత్రం బండాని, ఆరవ గోత్రం బేరంబోయిన, ఏడవ గట్టు పారేడుగట్టు ఆయా గోత్రాల వారు ఉంటారు.

ఈ గోత్రాల వారందరూ సమ్మక్క తల్లిని కొలిచే దైవంగా భావిస్తారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జనవరి చివరి వారంలో గాని ఫిబ్రవరి మొదటి వారంలో కానీ వచ్చే మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఘనంగా జాతర ఉత్సాహంగా నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసిలు వివిధ ఇంటి పేర్లు గోత్రాల వాళ్ళు ఇలవేల్పులుగా కొలిచే దైవాలుగా పగిడిద్దరాజు, గాదేరాజు, మూగరాజు, పిడుగురాజు, గడ్డి కామరాజు, బంగారు వజ్జయ్య జలిదేవి, కాటూరుడు, రెక్కల రామయ్య, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, చిక్కు నాగులమ్మ, కొమ్మలమ్మ, ముసలమ్మ, దూళిముత్తి మొదలగు ఇంటి ఇలవేల్పుల పండుగలు జాతర్లు నిర్వహిస్తారు.

విగ్రహారాధన లేదు కానీ...

వాస్తవానికి ప్రత్యేకించి కోయల్లో విగ్రహారాధన లేదు అయితే రాయికి మాత్రం ఓ ఆకారం అంటూ ఉండదు ఏదో ఒక రాయిని చెట్టు పుట్టను దేవుని ప్రతిమగా కొలుస్తారు. ప్రతి ఆదివాసి గూడెంలో ఇలవేల్పు దేవతలు ఉంటారు వర్షాలు సమృద్ధిగా కురవాలని కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని పశుపక్షాదులు రోగాల బారి నుండి కాపాడాలని మొక్కులు చెల్లించుకుంటారు. 5వ గొట్టు బండాని గోత్రం వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ దేవతను మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడం మండలంలోని ఎంచగూడెం గ్రామంలో వారి ఆచార సాంప్రదాయాల నడుమ ప్రతి ఏట హోలీ పున్నమి ముందు వచ్చే బుధ,గురు,శుక్రవారాలలో భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొమ్మలమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. పూర్వం వాసం వారి పూర్వీకుల కథనం ప్రకారం ఎంచగూడెం పక్కనున్న గుట్టలలో కొమ్మలమ్మ దేవత వెలిసినట్టుగా ఆగుట్టకు కొమ్మలమ్మ గుట్టగా నామరూపం చేసినట్లుగా అప్పటినుంచి వాసం వారి ఇలవేల్పుగా జాతర నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కొమ్మలమ్మ జాతరను కొలుచుటకు తలపతులుగా వాసం కుటుంబీకులు, వడ్డెలు,పూజారులుగా ఆలూరి యాలం వంశస్థులు గుడి ఏర్పాటు చేసి జాతర నిర్వహించడం జరుగుతుంది.

జాతర నిర్వహణ తీరు..

కొమ్మలమ్మ తల్లి ఇలవేల్పు వారు బండాని రాజు లేక రాయి బండాని రాజు అని అంటారు వీరు దేవుళ్లకు ఐదు బొట్లు పెట్టుకుంటారు ఇది వీరి సాంప్రదాయ కట్టుబాటు పండుగ మొదటిరోజు బుధవారం మెత్తి పానుపు శ్రీ వాసం నాగయ్య సాదిరెడ్డిపల్లి గార్ల ఇంటి నుండి తీసుకెళ్తారు సాయంత్రం ఎదురు ఏటకోడిని శ్రీ వాసం వీరస్వామి గోపాలపురం గారి చేతుల మీదుగా ఎదిరించి మొక్కుట కార్యక్రమం జరుగుతుంది అదే రోజు సాయంత్రం కొమ్ములమ్మ గుట్ట నుండి సాంప్రదాయ కర్రలతో, కుంకుమ భరణితో కొమ్మలమ్మ దేవత డోలు వాయిద్యాలు భక్తుల పూనకాల మధ్య గద్దెకు తీసుకో రావడం జరుగుతుంది ఆరోజు దైవదర్శనాలు జాగారాలు కొనసాగుతాయి. రెండవ రోజు గురువారం గర్భగుడి యందు కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో గిరిజనులు మొక్కులు చెల్లించుకోవడం కేశఖండనలు కానుకలు చెల్లించడం ఆనవాయితీ. మూడవరోజు శుక్రవారం తెల్లవారుజామున దేవతకు హారము సమర్పించడం జరుగుతుంది తిరిగి అదే రోజు వన ప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ మూడు రోజుల జాతర దళపతులు వాసం సమ్మయ్య వాసం వీరస్వామి ఆలూరి కృష్ణ పటేల్ వడ్డేలు పూజారులు ఆలూరు బుచ్చయ్య, ఆలూరు శ్రీను, యాలం లక్ష్మయ్య, పూజార్ల చేతులమీదుగా అంగరంగ వైభవంగా వారి సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆనవాయితీ.

(మార్చి 20,21,22 తేదీల్లో కొమ్మలమ్మ జాతర)

పెనుక ప్రభాకర్

ఆదివాసీ రచయితల వేదిక తెలంగాణ

94942 83038

Tags:    

Similar News