స్వదేశీ ఉద్యమమా? మేక్ ఇన్ ఇండియానా?

ఆర్థిక అభివృద్ధిలో 10 సంవత్సరాల పాలనాకాలం అంటే పెట్టుబడులు పెట్టే కాలానికీ, ఫలాలు అందుకునే కాలానికీ మధ్యగల కాలం. పదేళ్లు అంటే చాలా ఎక్కువే

Update: 2024-10-26 01:00 GMT

ఆర్థిక అభివృద్ధిలో 10 సంవత్సరాల పాలనాకాలం అంటే పెట్టుబడులు పెట్టే కాలానికీ, ఫలాలు అందుకునే కాలానికీ మధ్యగల కాలం. పదేళ్లు అంటే చాలా ఎక్కువే. ఈ పథకాన్ని ప్రారంభించిన పాలకులు పదేళ్లుగా వారే అధికారంలో ఉండటం గమనార్హం. కానీ అభివృద్ధి మంత్రంగా స్వదేశీ ఉద్యమంగా చేపట్టిన మేకిన్ ఇండియా పథకం దేశంలో వివిధ రంగాల అభివృద్ధి స్థాయిని పెంచలేకపోయింది. ఈ పథకం పురోగమనానికి అనేక రంగాల అల్పాభివృద్ధి అవరోధాలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అల్పాభివృద్ధి, యువతకు సాంకేతిక రంగంలో పరిజ్ఞానం లేకపోవడం, విద్యుత్ రవాణా రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం ఒకవైపు మేకిన్ ఇండియా పురోగమనానికి అవరోధాలుగా ఉన్నాయి. దేశంలో కావలసిన అవస్థాపన వసతులు ఉంటే తప్ప పెట్టుబడిదారులకు ముందుగా పెట్టుబడులు పెట్టలేరు. మేక్ ఇన్ ఇండియా పథకం ఉద్యోగతను కల్పించే బదులుగా నిరుద్యోగితను పెంపొందించింది. పారిశ్రామికీకరణకు బదులుగా పారిశ్రామిక పతనానికి దారితీసింది.

ఆనాడు మహాత్మా గాంధీ బ్రిటిష్ పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు వ్యతిరేకంగా స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చేపట్టిన స్వదేశీ ఉద్యమం నేడు మన ప్రధానమంత్రి చేపట్టిన మేక్ ఇన్ ఇండియా రెండూ ఒక్కటేనా? గాంధీజీ ప్రకారం పెట్టుబడి దారీ వ్యవస్థ నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. పరిపాలనా విధానా లు, చట్టాల ద్వారా అందరికీ క్షేమం అందించేదే రాజ్యం. అటు రాచరిక వ్యవస్థకు ఇటు కమ్యూనిస్టు వ్యవస్థకు మధ్య మార్గమే ఇప్పటి ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ. ఇది ఆయా దేశాల జాతీయ వాదానికి సంబంధించిన వాదన. దేశ జాతీయవాదం ప్రజల కోసం ఉండాలి గాని పెట్టుబడిదారుల లాభాల కోసం కాకూడదని గాంధీజీ అభిప్రాయ పడ్డారు. మనదేశంలో 1920 శతాబ్దంలో ఏర్పడిన జాతీయవాదం దేశ స్వాతంత్రం కోసం అన్ని కులాలను మతాలను కలుపుకొని వలస పాలనకు వ్యతిరేకంగా ఆవిర్భవించింది. మాకు బ్రిటిష్ ప్రజలతో ఎటువంటి వ్యతిరేకత లేదు. బ్రిటిష్ పెట్టుబడిదారులతోనే వారి పెట్టుబడుల వలన మా దేశంలో ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం పేదరికం ఏర్పడుతుందని మహాత్మా గాంధీ అన్నారు.

ఆనాడే నిజం గ్రహించిన గాంధీజీ

ఇంగ్లాండులో పారిశ్రామిక విప్లవంతో పెట్టుబడుల్లో, ఉత్పత్తిలో పెరుగుతున్నాయి గానీ ఆదాయ అసమానతలు తగ్గలేదు. 1890లో గాంధీ లండన్ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ చదివేటప్పుడు ఈ విషయాన్ని స్వయంగా గమనించి వివరించారు. వలస పాలకు లు మనదేశంలో వసూలు చేసిందల్లా సముద్రాల్ని దాటించి పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్‌లో జరిగేటట్టుగా చూసుకున్నారు. మనదేశంలో ఆదాయాలు తగ్గి నిరుద్యోగం పెరిగింది. పెట్టుబడిదారీ విధానం చిన్న చిన్న ఉత్పత్తిదారులను నిర్వీర్యం చేసి నిరుద్యోగం పెరిగేటట్లు చేస్తుందని గాంధీజీ అభిప్రా యం. ఈ క్రమంలోనే 1920లో బ్రిటిష్ పెట్టుబడిదారులను వ్యతిరేకించిన భారతీయ పెట్టుబడిదారులు తర్వాత బ్రిటిష్ పెట్టుబడిదారులతోనే లాలూచీ పడ్డారు. అందుకే స్వదేశీ విదేశీ ఫైనాన్స్ పెట్టుబడిదారుల చారిత్రక నేపథ్యం తెలుసుకోకుండా, వారి స్వలాభాపేక్షతో కూడిన జాతీయవాదాన్ని అర్థం చేసుకోకుండా మన ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమో..? ప్రస్తుత పాలకులు ఆలోచించాలి. తాము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ప్రజల కోసమా? పెట్టుబడిదారుల కోసమా? అనే ప్రశ్న వేసుకోవాలి. రోజురోజుకు ప్రస్తుత పాలకులు గాంధీజీ ఆర్థిక విధానాలకు ఎంత దూరం అవుతున్నారో గమనించాలి.

తిరోగమనంలోకి మేకిన్ ఇండియా..

2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం ద్వారా ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను పెంచి తద్వారా దేశంలో పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచాలని మౌలిక వసతులను కల్పించాలని ఉద్యోగతను పెంచాలని, అందుకోసం 25 ప్రధాన రంగాలను ఎంపిక చేసి వాటిలో పెద్ద సంఖ్యలో పెట్టుబడులను పెట్టేందుకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించి దేశంలో పారిశ్రామికీకరణ స్వదేశీయతతో కూడుకున్నదిగా అభివృద్ధి చేయాలని మన ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టిన తొలి రోజుల్లోనే కోరుకున్నారు. పది వసంతాలు పూర్తయినాయి. 2014 నుంచి 2023 వరకు ఎఫ్‌డీఐలలో 900 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆటో మొబైల్ రంగంలో పురోగతి ఫార్మాసూటికల్ రంగంలో గ్లోబల్ హబ్‌గా మారడం ఎలక్ట్రానిక్ పరిశ్రమ పురోగతి రక్షణ రంగంలో కూడా స్వావలంబన దిశగా అడుగులు వేయడం జరిగింది. అయినప్పటికీ దేశంలో పారిశ్రామికీకరణకు అవసరమైన మౌలిక వసతులు విద్యుత్, నీటి సౌకర్యాలు లేవని పెట్టుబడుల ప్రవాహం అక్కడికక్కడ అంతంత మాత్రంగానే సాగింది. దేశంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో పడింది అంటే డి ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందని చెప్పాలి. ఆనాడు గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి దేశంలో స్వదేశీ పరమైన పారిశ్రామికీకరణ జరగాలని విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, స్వదేశంలో ఉపాధిని పెంపొందించాలని కోరుకోవడం మన పాలకులు మరిచినట్టు ఉన్నారు. కానీ పెట్టుబడిదారుల కనుసన్నల్లో ఉన్న మేకిన్ ఇండియా పథకం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులపై ఆధారపడిన మేకిన్ ఇండియా పథకం తిరోగమనంలోకి పోయింది. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తుల వాటా మన స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల లేకుండా పోయింది. దేశంలో పరిశ్రమలు నిర్వీర్యమై పారిశ్రామిక రంగం పతనమైంది.

ప్రారంభించి 10 సంవత్సరాలైనా..

మేక్ ఇన్ ఇండియా పథకం ఉద్యోగతను కల్పించే బదులుగా నిరుద్యోగితను పెంపొందించింది. పారిశ్రామికీకరణకు బదులుగా పారిశ్రామిక పతనానికి దారితీసింది. విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులను నమ్ముకుని కార్పొరేట్ రంగానికి బలోపేతం చేసి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను నిర్వీర్యం చేయడం వలన ఉద్యోగిత, డిమాండ్, పెట్టుబడులలో ఆర్థిక వ్యవస్థలో తగ్గిపోయి ప్రజల కొనుగోలు శక్తి నిర్వీర్యమైంది. ఫలితంగా 2024లో ఆకలి సూచికలో 127 దేశాలలో మన దేశం 105వదిగా మిగిలింది. కొనుగోలు శక్తి లేక ప్రజలు దేశంలో ఉన్నారని తెలుస్తుంది. 2022లో ప్రచురించిన వరల్డ్ ఇన్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో సంపన్నులు ఒక శాతం దగ్గర 40 శాతం పైగా సంపద ఉన్నది. బిలినియర్ల రాజ్యంగా భారత్ మారుతున్నదని ఈ నివేదిక తెలియజేస్తున్నది. మేక్ ఇన్ ఇండియా స్వదేశీ ఉత్పత్తుల ఉద్యమంగా ప్రారంభించి 10 సంవత్సరాలైనా ఉద్యోగిత కానీ ఆదాయాలు కానీ పెరగక దేశ ప్రజలకు నిరాశ మిగిలింది.

డా. ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Tags:    

Similar News