జోడేఘాట్ ఉద్యమ వ్యూహకర్త

Jodeghat movement strategist Kumram suru

Update: 2024-03-24 00:30 GMT

నిజాం నిరంకుశ పాలనలో 1938 - 1940ల మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన జోడేఘాట్ సాయుధ పోరాటం దేశచరిత్రలోనే అరుదైనది. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజనులను కూడగట్టి గెరిల్లా సైన్యంతో పోరాడిన తెలంగాణ తొలి గిరిజన పోరాట యోధుడు కుమ్రం భీంకు ప్రధాన అనుచరుడిగా, పోరాట వ్యూహకర్తగా పనిచేసిన కుమ్రం సూరు అజరామరుడు.

ఆయన ఆదివాసీ గూడేల్లో అరాచకాలు సృష్టించే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా సైన్యం ఏర్పాటులో కుమ్రం భీంకు హవల్దార్‌గా కుమరం సూరు ప్రధాన భూమిక పోషించారు. ఆదివాసీ యువకులను సైనికులుగా తీర్చిదిద్దడానికి తగిన సూచనలు చేస్తూ వారిని సమీకరించారు. వెదురుతో విల్లంబులు, బాణాలు తయారుచేయడం, ఉచ్చులు బిగించడం మాత్రమే కాదు, భీమ్ దగ్గర గెరిల్లా, యుద్ధతంత్రాన్ని నేర్చుకుని పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మరోవైపు కుమ్రంభీంకు తన అక్షర జ్ఞానంతో రాజకీయ మెళకువలను కుమ్రం సూరు దగ్గరుండి నేర్పించారు.

వారి ఇంటి పేర్లు ఒకేలా ఉన్నా, కుమ్రం భీం గిరిజన గోండు తెగకు చెందినవాడైతే, కుమ్రం సూరుది కొలాంతెగ. ఐనా వీరిద్దరి కలయికే జోడేఘాట్ పోరాటాన్ని మరింత విస్తృతం చేసింది. ఆదివాసీలందరినీ కూడగట్టింది.

నిజాం ప్రభుత్వం తరపున పట్వారీలు, చౌకీదార్లు పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వారిపై దాడులు చేయాలని భీమ్ ఆజ్ఞాపించినప్పుడు దానికి తగినవిధంగా సూరు వ్యూహరచన చేసి ప్రతిదాడులకు నాయకత్వం వహించేవాడు. నిజాం ప్రభుత్వానికి తన డిమాండ్లను తెలుపడానికి కుమ్రం భీం కాలినడకన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ప్రధాన సహాయకుడిగా సూరు ఆయనతోనే ఉన్నారు. నిజాం సర్కార్ వీరిద్దరికీ కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో కుమ్రం భీమ్, సూరు లిద్దరు మనస్తాపం చెంది జోడేఘాట్ కు తిరిగివచ్చారు. నిజాం సర్కార్ పై ఆవేదనతో, కసితో రగులుతున్న వీరిద్దరూ.. గోండు, కోలాం యువకుల్ని కూడగట్టి ప్రతిభ గల సైనికులుగా సుశిక్షితులను చేసి' ' జల్, జంగిల్, జమీన్ ' గెరిల్లా యుద్ధ తంత్రం వంటబట్టించి జోడే ఘాట్ కేంద్రంగా యుద్ధానికి వారిని సమాయత్తం చేశారు.

జోడేఘాట్ గుట్టల్లో కుమ్రం భీమ్ సైన్యంపై 1940 అక్టోబర్ లో నిజాం సైనికులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన భీం వీర మరణం పొందారు. ఆ యుద్ధభూమిలోనే సూరు కుడిచేయి, కుడి కాలుకు, నడుముకు తూటాలు తగిలి గాయాలయ్యాయి. ఆ సమయంలో కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. 1940లో కుమ్రం భీం నాయకత్వంలో నడిచిన గెరిల్లా పోరాటాన్ని, అందులోని ఒడిదొడుకులను బాహ్య ప్రపంచానికి తెలిపినది ఆయనే. మనం ఈ రోజు చూసే 'కుమ్రం భీమ్' ఛాయా చిత్రం సూరు చెప్పిన రూపురేఖల ఆధారంగా రూపొందించినది. ప్రతి ఏటా గోండు, కొలాం, తోటి తెగల ఆదివాసులు శేకన్ గొందిలో వున్న సూరు సమాధి వద్ద నివాళులర్పించడం వారి సంప్రదాయం. జోడేఘాట్ పోరాటంలో కుమ్రం భీమ్‌కు అండగా నిలిచిన కుమరం సూరు పాత్ర అణగారిన సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది అనడం నిస్సందేహం !

(రేపు కుమరం సూరు 106వ జయంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక,

94913 18409

Tags:    

Similar News