ఫీజుల దోపిడీని అరికట్టాలి!

Update: 2024-07-03 00:30 GMT

జీవో నెంబర్ 91 ద్వారా ప్రాంతాల వారీగా వసూలు చేయాల్సిన ఫీజులను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వం గుర్తింపు పొంది, అర్హులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు ఉన్న పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 9 వేలకు మించకూడదు. పట్టణ ప్రాంతాలలో ఏడాదికి రూ.12,500 తీసుకోవాలి. అన్ని ఫీజులు ఇందులో భాగమే అని ప్రభుత్వ జీవోలో స్పష్టంగా ఉన్నా వాటిని తుంగలో తొక్కి దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు.

మూడు, నాలుగేళ్ల పసివాడు సంవత్సరం మొత్తం రెగ్యులర్ బడికి వెళ్లినా తెలుగు వర్ణమాల, ఆంగ్లంలో ఆల్ఫాబెట్స్ కూడా సరిగ్గా నేర్చుకోలేడు. నాలుగు అక్షరాలు నేర్పించడానికి లక్షల రూపాయల ఫీజు వసూలు చేయడం ఏమిటని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ద్వితీయ శ్రేణి కార్పొరేట్ స్కూల్‌ని చూస్తే, పేరున్న ప్రైవేటు విద్యాసంస్థల వారు ఎల్‌కేజీకి 40 వేల వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 40 వేల రూపాయల నుంచి 80 వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. తరగతి పెరిగే కొద్దీ ఈ మొత్తం మరింత పెరుగుతూనే ఉంది. ఇవిగాక పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్, స్కూల్ యూనిఫామ్, టై, బెల్టు, సాక్సులు, బ్యాగుల దుకాణాలు బడిలోనే ఏర్పాటు చేస్తున్నారు. పుస్తకాలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. రకరకాల సామాగ్రి పేరిట అదనంగా డబ్బులు లాక్కుంటున్నారు. పేరున్న విద్యాసంస్థలు బిల్డింగ్ ఫండ్‌ను కూడా వసూలు చేస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

రాష్ట్ర ప్రభుత్వం 1994లో జీవో నెంబర్ 1లో ఒకసారి, 2008 లో జీవో నెంబర్ 90, 91, 92లలో మరోసారి ప్రైవేటు విద్యాసంస్థలు పాటించాల్సిన నియమ నిబంధనలు పేర్కొంది. ఈ జీవోలలో ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 1994 జీవో నెంబర్ 1 ప్రకారం ఫీజులను నిర్ణయించడానికి పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరు, విద్యార్థి సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. పాఠశాల యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 5 శాతానికి మించి తీసుకోవడానికి వీల్లేదు. వసూలు చేసిన ఫీజులో 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా ఇవ్వాలి. 15% వరకు పాఠశాల నిర్వహణ విద్యుత్, అద్దె ఖర్చులు, 15% స్కూల్ అభివృద్ధికి ఉపయోగించాలి. 15% ఫీజులు స్కూల్ సిబ్బందికి బీమా, భవిష్య నిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. 2008 జీవో నెంబర్ 90, 91, 92 ప్రకారం ఫీజు నిర్ణయించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానిక పాఠశాలలను పరిశీలించి మౌలిక సదుపాయాలు, పరిస్థితులు చూసి ఎంత ఫీజు వసూలు చేయాలనే విషయమై నివేదిక ఇస్తుంది. దీనిపై విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన విడుదల చేయాలి. ఈ ఉత్తర్వులను విధిగా అమలు చేయాలి. జీవో 42 ప్రకారం ఫీజును పెంచాలంటే జిల్లా ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతి లేకుండా ప్రతి సంవత్సరం 20 నుండి 30 శాతం ఫీజును పెంచడానికి వీలు లేదు. జీవో 91 నెంబర్ ప్రకారం దరఖాస్తులకు 100 రూపాయలు, అడ్మిషన్ ఫీజు 500 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అదే పాఠశాలలో పుస్తకాలు, విద్యా సామాగ్రిని కొనుగోలు చేయాలన్న నిబంధనలను పెట్టరాదు. పాఠశాలలో విక్రయ కేంద్రాలు తెరవకూడదు.

తోక పేర్లతో ఫీజులు దోపిడీ

ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల చదవడానికి విద్యార్థులు ఆకర్షించే విధంగా, తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి వివిధ రకాల పేర్లు జోడిస్తున్నారు. సెక్షన్ 8 (1) ప్రకారం విద్యా సంస్థల పేర్లకు ఈ టెక్నో, లెర్నింగ్, గ్లోబల్, స్మార్ట్, ఐఐటీ, నీట్, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్, వంటి పదాలను చేర్చకూడదు. ఇలా వివిధ రకాల విద్యాసంస్థల తోక పేర్లతో పాఠశాలలు అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈ పేర్లతో భారీ హోర్డింగులు , బోర్డులతో, బ్యానర్లతో అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. 2008 లో జీవో నెంబర్ 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కూడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక సామాగ్రిని అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్, విద్యా సంస్థల్లో అగ్నిమాపక పూర్తిస్థాయిలో సామాగ్రిని పెట్టడం లేదు.

విద్యా హక్కు చట్టం అమలుకు..

2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. ప్రతి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యను అందించాలి. కానీ ఏ విద్యాసంస్థలు కూడా ఉచిత విద్య అందించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో నర్సరీ నుండే వేల రూపాయలు మొదలుకొని పదో తరగతి విద్యార్థులు లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఆదాయం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాహక్కు చట్టం అమలుకు ఫీజుల నియంత్రణ చట్టానికి, అక్రమ దోపిడిని అరికట్టేందుకు విద్యావేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

లకావత్ చిరంజీవి,

కాకతీయ యూనివర్సిటీ వరంగల్,

99630 40960

Tags:    

Similar News