బీసీలంటే బిచ్చగాళ్లు కాదు..

BCs are not beggars..

Update: 2024-04-07 00:45 GMT

93 ఏళ్ల క్రితం 1931లో కులగణన జరిగింది. గత కొన్నేళ్లుగా తిరిగి కులగణన చేపట్టాలనీ, ఓబీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని, జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్ర శాఖ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూనే వస్తున్నాం. ఎన్ని ఏళ్లు గడిచినా కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. చట్టసభల్లో 50% బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా వచ్చిన రోజున, దేశ స్థాయిలో కులగణన చేసిన రోజున బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సంక్షేమం సాధికారత సాధ్యపడుతుంది. బీసీలంటే బిచ్చగాళ్లు కాదు.. పోరాట యోధులు అనే విషయాన్ని మరచిపోకూడదు.

దేశంలో సింహభాగం జనాభా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమాన వాటా ఇవ్వకుండా, సామాజిక అన్యాయం జరుగుతోంది. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల వారు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. బీసీల మౌనం వెనుక ఎంతో పెద్ద కథ ఉంది. వారి మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేక ధోరణిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. బీజేపీ బీసీలకు మద్దతు ఇవ్వకపోగా.. వారిని అణగదొక్కడానికే ప్రయత్నాలను చేస్తూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన సీట్లను చూస్తుంటే కూడా ఆ పార్టీకి బీసీల మీదున్న కపట ప్రేమ ఏమిటో అర్థం అవుతూ ఉంది.

ప్రతీ బడ్జెట్‌లోనూ బీసీలకు తక్కువ కేటాయింపులు చేసి వారి మనోభావాలను బీజేపీ కించపరుస్తూనే వస్తోంది. మరోసారి అధికారంలోకి బీజేపీ వచ్చినా కూడా బీసీలకు మొండిచేయి చూపించడం తప్ప వేరే ఏమైనా చేస్తుందా అంటే అది కూడా అనుమానమే! కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీల కోసం కులగణన తీసుకుని వచ్చింది. అది నిజంగా స్వాగతించాల్సిన విషయమే.. కానీ బీసీలకు ఇది చేస్తాము.. ఈ పనులు చేసి పెడతాము అని హామీ ఇవ్వడంలో బీజేపీ ముందు నుండి తటపటాయిస్తూ ఉండడం బాధపడాల్సిన అంశం.

కులాలవారీగా జనగణనే మార్గం

వెనుకబడిన కులాలవారీగా జనగణన చేపట్టాలని బీసీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. ఉద్యోగుల్లో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తక్కువగా ఉందని, కులాల వారీగా జనగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని చెబుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్దంగా వ్యవహరించని ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదు. రాష్ట్ర ప్రజల అంశాలపై నిర్విరామంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో లేవనెత్తుతున్నాము. పేదలు, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి ఈ కేంద్ర ప్రభుత్వమని ప్రజలు గుర్తించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని చేసిన పోరాటాలను బీజేపీ ప్రభుత్వం తొక్కేసింది. బీసీ నేతలు రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడకూడదు.. బీసీలకు మంచి చేయడం కోసం ప్రయత్నించాలి. అసలు లెక్కలు బయటకు వస్తే రిజర్వేషన్లు అమలు చేయలేరని.. అందుకే కులాల గణన చేయడం లేదని అనిపిస్తోంది. బీసీలను బానిసల్లా చూస్తున్న ప్రభుత్వాలని ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడించాలి.

దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Tags:    

Similar News