యాసంగి పంట ఉత్పత్తులు కొంటారా.. కొనరా..?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: యాసంగిలో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తారా.. లేదా..? అసలు కొనుగోలు కేంద్రాలు ఉంటాయా.? మద్దతు ధర లభిస్తుందా..? ఏయే పంటలను, ఎక్కడెకక్కడ కొనుగోలు చేస్తారు.? ఇలా అనేక ప్రశ్నలు.. అడుగడుగునా అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి. ఆరుగాలం శ్రమించే అన్నదాత.. అష్టకష్టాలు పడి పండించిన పంటల కొనుగోలుపై స్పష్టత లేకుండా పోయింది. నూతన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో కేంద్రం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా.. తాజాగా కేంద్ర […]

Update: 2021-02-10 21:09 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: యాసంగిలో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తారా.. లేదా..? అసలు కొనుగోలు కేంద్రాలు ఉంటాయా.? మద్దతు ధర లభిస్తుందా..? ఏయే పంటలను, ఎక్కడెకక్కడ కొనుగోలు చేస్తారు.? ఇలా అనేక ప్రశ్నలు.. అడుగడుగునా అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి. ఆరుగాలం శ్రమించే అన్నదాత.. అష్టకష్టాలు పడి పండించిన పంటల కొనుగోలుపై స్పష్టత లేకుండా పోయింది. నూతన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో కేంద్రం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నట్లు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా.. తాజాగా కేంద్ర నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్లే యోచనలో ఉంది.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూడింట రెండొంతుల మేర తగ్గించాలని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దోబూచులాటతో రైతుల్లో గందరగోళం నెలకొంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి వరి, శనగలు, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున సాగు చేశారు. వీటితో పాటు ఎర్రజొన్నలు, జొన్నలు, గోధుమలు, నువ్వులు వంటి పంటలు కూడా సాగు చేశారు. ఇప్పటికే వానాకాలంలో వేసిన కందులు, రబీలో వేసిన శనగలు రైతు ఇంటికి వస్తున్నాయి. అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు బయట ప్రైవేటు మార్కెట్లో విక్రయిస్తున్నారు. కందులు, మొక్కజొన్న, శనగల కొనుగోలు కేంద్రాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు యాసంగిలో పండించిన పంట ఉత్పత్తులను విక్రయించాలా.. వద్దా..? మద్దతు ధర లభిస్తుందా.. లేదా.. అనే ఆలోచనలో పడిపోయారు.

తగ్గనున్న కొనుగోలు కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 45 నుంచి 50 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 85 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో లక్ష ఎకరాలు, ఆసిఫాబాద్ జిల్లాలో 35 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంలో సుమారు 470 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ సారి మూడింట రెండొంతుల కేంద్రాలకు కోత పెడుతున్నారు. నిర్మల్ జిల్లాలో గతంలో 196 కొనుగోలు కేంద్రాలుండగా.. తాజాగా 67 కేంద్రాలు పెట్టే యోచనలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో గతంలో 200 కుపైగా కేంద్రాలుండగా.. తాజాగా 65 కేంద్రాలు పెట్టనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గతంలో 25 కేంద్రాలుండగా.. తాజాగా 12 కేంద్రాలు పెట్టే యోచనలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అసలే కేంద్రాలు పెట్టే అవకాశం లేదు.

మార్కెటింగ్ అధికారులతో సీఎం, మంత్రి సమావేశం

ఇటీవల రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్​లో మార్కెటింగ్ అధికారులతో సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బియ్యం తీసుకునేందుకు ఎఫ్ సీ ఐ ముందుకు వస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వం పర్చేసింగ్​సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. రైతుల నుంచి నిరసన వస్తుందని.. ముందస్తు యోచనతోనే కొనుగోలు కేంద్రాలు తగ్గించి.. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సర్కారు నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకపోయినా.. కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సిద్ధంగా ఉండేలా మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖలు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. కొనుగోలు కేంద్రాలు భారీగా తగ్గిస్తే.. రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. బయట రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లి విక్రయించాల్సి ఉంటుంది. ఇప్పటికే మిల్లర్ల వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోగా.. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటేనే మిల్లర్లు ధాన్యం కొనే పరిస్థితి ఉంది. ఇక మద్దతు ధర మాట దేవుడెరుగు.

Tags:    

Similar News