పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని వివాహం చేయడానికి నిర్ణయం తీసుకున్నారనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం

Update: 2024-10-22 14:46 GMT

దిశ, జగదేవ్ పూర్ ; తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని వివాహం చేయడానికి నిర్ణయం తీసుకున్నారనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జనార్దన్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అనంతసాగర్ గ్రామానికి చెందిన దాసరి అర్చన (18) అనే యువతి గజ్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కాగా అర్చన అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయంలో అర్చన తల్లిదండ్రులు ఆమెకు వద్దని నచ్చజెప్పి మరొక యువకుడితో వివాహం నిశ్చయించారు.

దీంతో తీవ్ర మనస్థాపం చెందిన అర్చన ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరివేసుకుంది. అయితే పొలం పనులకు వెళ్లిన అర్చన తండ్రి కొండయ్య మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి కూతురును పిలిచి తలుపులు తట్టగా ఎంతకూ తెరువలేకపోయింది. దీంతో కొండయ్య ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా దూలానికి అర్చన ఉరేసుకుని కనిపించింది. కాగ కొండయ్యకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. మృతురాలు అర్చన రెండవ కుమార్తె. ఈ మేరకు మృతురాలి తల్లి మల్లమ్మ ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ వో జనార్దన్ వివరించారు.


Similar News