కొడుకు చూస్తుండగానే భర్తను చంపిన భార్య…

మరొక వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హత్య చేసిన సంఘటన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-24 13:49 GMT

దిశ, సూర్యాపేట : మరొక వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హత్య చేసిన సంఘటన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసు సంబంధిత వివరాలను సూర్యాపేట రూరల్ సిఐ వై.సురేందర్ రెడ్డి మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట మండలంలోని హనుమ నాయక్ కు చెందిన ధరావత్ కౌసల్య అదే తండాకు చెందిన మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పారు. తన అక్రమ సంబంధానికి భర్త ధరావత్ సైదా తరచూ అడ్డు వస్తూ గొడవ పడుతుండడంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.

అందుకు ఆగస్టులో భర్త సైదా తాగి వచ్చి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి సుమారు 11:30 సమయంలో సైదాను గొడ్డలితో కణతపై నరికి హత్య చేసింది. కాగా భర్త తాగి వచ్చి చెక్క బల్ల అంచుపై పడి చనిపోయాడని అందరినీ నమ్మించింది. తండ్రి హత్యను చిన్న కొడుకు వినోద్ చూడగా, ఆమె అతన్ని బ్రతిమిలాడి, హత్య విషయం బయట తెలిస్తే తను జైలుకు పోతానని, మీరు బ్రతకడం కష్టమవుతుందని నమ్మించింది. అందుకు భయపడిన వినోద్ ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచాడు. కాగా ఈ నెల 22న కౌసల్య తన చిన్న కొడుకు వినోద్ తో గొడవ పెట్టుకుంది. కోపోద్రిక్తుడైన

వినోద్ తండ్రిని మన తల్లి కౌసల్యనే హత్య చేసిందని, అన్న సాయి కుమార్ తో చెప్పాడు. దీంతో ఈ నెల 23న సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో అతను ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్సై బాలు నాయక్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచనల మేరకు డీఎస్పీ జి.రవి ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ సీఐ వై. సురేందర్ రెడ్డి విచారణ చేపట్టి మంగళవారం నేరస్థురాలైన ధరావత్ కౌసల్య ను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని సీజ్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.


Similar News