పిడుగుపాటుతో ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2024-09-24 14:59 GMT

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. అరటి తోటలో పనులు చేస్తున్న కూలీలపై పిడుగు పడటంతో ఇద్దరు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగ్గారం గ్రామంలోని ఓ రైతు అరటి తోటలో పనులకు వెళ్లిన కూలీలు మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో దగ్గరలోని ఓ చెట్టు కిందకు వెళ్లారు.

    ఆ సమయంలో ఒక్కసారిగా ఆ దగ్గరలో పిడుగు పడటంతో బూర్గుంపు గ్రామానికి చెందిన సున్నం అనూష (23) , కట్టం నాగశ్రీ (18) అక్కడికక్కడే మృతి చెందగా, జగ్గారం గ్రామానికి చెందిన మడకం సీతమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన క్షతగాత్రులను సత్తుపల్లికి తరలించగా మడకం సీతమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పొట్ట చేత పట్టుకొని పొలం పనులకు వెళ్లిన కూలీలపై పిడుగు పడి మృతి చెందడంతో జగ్గారం, బూర్గుంపు గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News