లైన్ మెన్ నిర్లక్ష్యానికి యువకుడు బలి..

జూనియర్ లైన్ మెన్ నిర్లక్ష్యానికి యువకుడు షాక్ కు గురై మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది.

Update: 2024-09-25 12:04 GMT

దిశ, హుస్నాబాద్ : జూనియర్ లైన్ మెన్ నిర్లక్ష్యానికి యువకుడు షాక్ కు గురై మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండా గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ తిరుపతి (29) కి మంగళవారం విద్యుత్ మరమ్మత్తు కోసం కపూర్ నాయక్ తండాలోని పోల్ ఎక్కమని జూనియర్ లైన్ మెన్ రాజేందర్ చెప్పాడు. కాగా అక్కన్నపేట మండలం రామవరంలో ఉన్న నాలుగు ఫీడర్లలో కపూర్ నాయక్ తండా ఫీడర్ కు బదులు రామవరం రూరల్ ఫీడర్ బ్రేక్ డౌన్ చేశాడు. దీంతో పోల్ ఎక్కిన తిరుపతి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయం తెలిసిన జూనియర్ లైన్ మెన్ విద్యుత్ అధికారులకు, పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. దీంతో చనిపోయిన తిరుపతి బంధువులు అకారణంగా జూనియర్ లైన్ మెన్ నిర్లక్ష్యానికి బలయ్యాడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి నుండి మృతదేహాన్ని తీయకుండా ఘటనా స్థలంలోనే ఆందోళన చేపట్టారు. బుధవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధుల పై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తిరుపతి అవివాహితుడు. రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉండగా ఇంతలోనే విద్యుత్ షాక్ కు గురై చనిపోవడంతో కపూర్ నాయక్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News