ప్రేమించిన యువతి దక్కలేదని యువకుడి ఆత్యహత్య..

మర్కుక్ మండలంలోని పాతూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-09-25 11:28 GMT

దిశ, ములుగు : మర్కుక్ మండలంలోని పాతూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో యువకుడు పురుగుల మందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మర్కుక్ మండలంలోని పాతూరు గ్రామంలో ఇరన్న అనిల్ కుమార్ (21) నివసించేవాడు. కాగా హైదరాబాదులోని గాంధీ నగర్ కు చెందిన అనూష పాతూరు గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వస్తూ ఉండేది. అయితే అనిల్ కుమార్, అనూషలు ఇద్దరూ గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు అతని పెళ్లికి అంగీకరించారు. కానీ అనూష తరపు బంధువులు, కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం, తమ అమ్మాయిని చూడవద్దంటూ బెదిరింపులకు గురిచేశారని తెలిపారు.

ఇక ప్రేమించిన యువతితో పెళ్లి జరగకపోవడంతో మనస్థాపానికి గురైన అనిల్ కుమార్ ఈ నెల 23 వ తేదీ ఆదివారం పాతూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. అనిల్ కుమార్ ను చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.


Similar News