విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం.. మంత్రి లోకేష్ విచారం
బెజవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదుల బస్సు అజ్మేర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఒకరు మరణించారు.
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ బార్ అసోసియేషన్ (Bezawada Bar Association) కు చెందిన న్యాయవాదుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. న్యాయవాదులంతా కలిసి రెండు బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో రాజస్థాన్ లోని అజ్మేర్(Ajmer) వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఒక బస్సు ప్రమాదానికి(Bus Accident) గురైంది. ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీ కొట్టడంతో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రాజేంద్రప్రసాద్ సహా మరో 11 మందికి గాయలవ్వగా.. వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం విచారకరమని పేర్కొన్నారు. న్యాయవాది రాజేంద్రప్రసాద్ భార్య ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్రప్రసాద్, ఇతర లాయర్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.