ఆస్తి తగాదాల్లో ఒకరి హత్య...

ఆస్తి తగాదాల్లో ఒకరి హత్య జరిగిన సంఘటన మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మహేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

Update: 2024-10-14 15:11 GMT

దిశ, కార్వాన్: ఆస్తి తగాదాల్లో ఒకరి హత్య జరిగిన సంఘటన మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మహేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళహాట్ టక్కరి వాడి ప్రాంతానికి చెందిన జగదీష్, రఘువీర్ సింగ్ లు ఇద్దరు అన్నదమ్ములు. అయితే వీరి తండ్రి ఆస్తిలో ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే జగదీష్ సింగ్ కుమారుడు దుర్గేష్ సింగ్(40) ప్రైవేట్ జాబ్ కాగా రఘువీర్ సింగ్ కుమారుడు బజరంగ్ సింగ్ స్థానికంగా టీ స్టాల్. బజరంగ్ సింగ్ తన బంధువులు తుల్జారాం సింగ్ (చేతన్), సత్యనారాయణ సింగ్ (టింకు) లు కలిసి దుర్గేష్ సింగ్ కు ఆదివారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకుందాం అని బయటికి పిలిచారు. వెంటనే మాట్లాడుకోవడానికి దుర్గేష్ సింగ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు.

అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బజరంగ్ సింగ్, తుల్జారాం సింగ్, సత్యనారాయణ సింగ్ ఆస్తి తగాదాల విషయంలో ముగ్గురు కలిసి దుర్గేష్ సింగ్ పై దాడి చేశారు. బజరంగ్ సింగ్, దుర్గేష్ సింగ్ ను నెట్టి వేయడంతో కిందపడి తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే దుర్గేష్ సింగ్ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బజరంగ్ సింగ్, తుల్జారాం సింగ్, సత్యనారాయణ సింగ్ లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అయితే గతంలో కూడా మూడు సార్లు దుర్గేష్ సింగ్ పై ఆస్తి తగాదాల విషయంలో కూడా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గతంలో బజరంగ్ సింగ్ పై 307 కేసు నమోదయి ఉందని పోలీసులు తెలిపారు.


Similar News