నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టురట్టు
అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాల ముఠాను శామీర్పేట పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, శామీర్ పేట్ : అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాల ముఠాను శామీర్పేట పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం శామీర్పేట ఓఆర్ఆర్ వద్ద బ్రిడ్జి కింద డీసీఎం వాహనంలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ మేడ్చల్, శామీర్పేట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. డీసీఎంలో కర్ణాటక నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను విచారించగా మంచిర్యాలకు చెందిన సొల్లు సురేశ్ అనే వ్యక్తం నరేశ్ అనే వ్యక్తి డీసీఎం కిరాయికి మాట్లాడుకుని కర్ణాటక నుంచి మంచిర్యాలకు పత్తి విత్తనాలు తీసుకురావాలని రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
ఒప్పంద ప్రకాంరం నరేశ్ కొస్తంగికి చెందిన రమణ అలియాస్ రామయ్య నుండి డీసీఎం వాహనంలో కర్ణాటక కుస్తగి నుంచి మంచిర్యాలకు 3750 కిలోల (150 బస్తాల)పత్తి విత్తనాలను తీసుకుని బయలు దేరాడు. మార్గమధ్యలో శామీర్పేట ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద పోలీసులు పట్టుకుని కటకటాలకు తరలించారు. సురేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ విత్తనాలను వాడొద్దన్నారు. భూ కాలుష్యాన్ని అరికట్టాలని రైతులను కోరారు. ప్రెస్మీట్లో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు, సీఐలు శ్రీనాథ్, శామ్ సుందర్ రెడ్డి, డీఐ గంగాధర్, ఏఓ రమేష్, ఎస్ఐ దశరత్, హారిక, సిబ్బంది పాల్గొన్నారు.