స్కూటీని ఢీ కొట్టిన డీసీఎం.. మాజీ ఎంపీటీసీ భర్త మృతి..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధి, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-09-25 16:20 GMT

దిశ, జవహర్ నగర్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధి, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను డీసీఎం ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ ఉపసర్పంచ్ కందాడి అమరేందర్ రెడ్డి తన భార్య ప్రమీలతో కలిసి బైక్ పై డంపింగ్ యార్డ్ ప్రధాన రోడ్డు గుండా తిమ్మాయిపల్లికి వెళ్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద బైక్ ను డీసీఎం ఢీకొట్టడంతో తిమ్మాయిపల్లి మాజీ ఎంపీటీసీ భర్త అమరేందర్ (55) ఘటనా స్థలంలోనే చనిపోయాడు. భార్య ప్రమీల తీవ్రంగా గాయపాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాన్ని కార్యాలయం ముందు ఉంచి ఆందోళన..

డంపింగ్ యార్డుతో ప్రమాదం జరిగిందని తిమ్మాయిపల్లి వాసులు, మృతుడి బంధువులు రాంకీ కార్యాలయం పై దాడి చేసి అద్దాలను పగులగొట్టారు. మృతదేహాన్ని కార్యాలయం ముందు ఉంచి ఆందోళనకు దిగారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వ్యర్థ రసాయానాలు బయటకు రావడంతో వాహనాలు జారి ప్రమాదానికి గురవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వ్యర్థ రసాయానాలు రోడ్డుపైకి రావడంతో ప్రమాదాలు జరిగి స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News