మద్యం మత్తులో యువకుల వీరంగం.. కౌన్సిలర్ భర్త పై కత్తితో దాడి

కారును రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని మందలించినందుకు కౌన్సిలర్ భర్తపై అడ్డొచ్చిన మరో ఇద్దరి పై యువకులు కత్తులతో దాడి చేశారు.

Update: 2024-09-24 03:03 GMT

దిశ, చౌటుప్పల్: కారును రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని మందలించినందుకు కౌన్సిలర్ భర్తపై అడ్డొచ్చిన మరో ఇద్దరి పై యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని సరూర్ నగర్ కు చెందిన మిరాజ్, ఖాజా, షకీర్, షారుక్ అమిన్‌లు చౌటుప్పల్‌లోని తన మిత్రుడు నుమాన్‌ను కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో అందరూ కలిసి దావత్ చేసుకొని మద్యం సేవించారు. రాత్రి 8 గంటల సమయాన చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ దండ హిమబిందు భర్త దండ అరుణ్ తన ఇంటి వద్ద నుంచి రోడ్డు వైపు వెళ్తుండగా ఈ ఐదుగురు యువకులు కారులో అరుణ్‌కు పక్క నుంచి ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు.

దానికి దండ అరుణ్ మందలించగా ఒక్కసారిగా ఐదుగురు కారులోంచి దిగి దండ అరుణ్ పై దాడి చేశారు. అందులోనుండి ఒక యువకుడు కత్తితో దండ అరుణ్ పొట్టలో పొడిచాడు. గొడవ తీవ్రతరం అవుతుండడంతో అదే కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, సురకంటి బాలకృష్ణారెడ్డి ఇద్దరు యువకులు ఆపడానికి ప్రయత్నించడంతో వారిపైన కత్తితో తెగబడ్డాడు .ఈ దాడిలో సురేందర్ రెడ్డి బాలకృష్ణ లకు సైతం కత్తి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకులను పట్టుకొని చితకబాదారు అందులో మీరాజ్, ఫరిద్‌లకు స్వల్ప గాయాలు కావడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ముగ్గురుని చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు.


Similar News