Stock Market: 1,330 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణ డేటా మాంద్యం భయాలను పోగొట్టడంతో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి.

Update: 2024-08-16 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాలు నమోదయ్యాయి. ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, కీలక బ్లూచిప్ స్టాక్స్, ఐటీ రంగ షేర్లలో ర్యాలీ కారణంగా సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణ డేటా మాంద్యం భయాలను పోగొట్టడంతో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపించడంతో మిడ్-సెషన్ తర్వాత మార్కెట్ల ఒక్కసారిగా పెరిగాయి. సెన్సెక్స్ ఏకంగా 1,400 పాయింట్ల వరకు పుంజుకుంది. ప్రధానంగా అమెరికా జాబ్స్ డేటా, వినియోగ డేటా ప్రభావం అధిక లాభాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,330.96 పాయింట్లు ఎగసి 80,436 వద్ద, నిఫ్టీ 397.40 పాయింట్లు లాభపడి 24,541 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాల షేర్లు 1 శాతానికి పైగా ఎగసిపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఐటీసీ షేర్లు 2 శాతానికి పైగా పెరిగి అధిక లాభాలను నమోదు చేశాయి. సూచీల భారీ లాభాల నేపథ్యంలో శుక్రవారం మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 7.27 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. దాంతో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 451.56 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.94 వద్ద ఉంది. 

Tags:    

Similar News