SBI: ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్..ఆ స్పెషల్ స్కీమ్ గడువు తేదీ పెంపు..!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits) చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-10 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits) చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అధిక వడ్డీ రేట్లు కల్పించే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 'ఎస్‌బీఐ అమృత్ వృష్టి(SBI Amrit Vrishti)' గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ పథకానికి సెప్టెంబర్ 30, 2024తో గడువు ముగియగా, ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడంతో మరోసారి గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పథకాన్ని వచ్చే సంవత్సరం మార్చి 31, 2025 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అధిక వడ్డీ కోసం డిపాజిట్లు చేయాలనుకునే వారికి ఇదో సువర్ణవకాశంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో మరో ఆరు నెలల వరకు ఈ పథకంలో మనీ ఇన్వెస్ట్ చేసేందుకు ఛాన్స్ లభించినట్లయింది.

కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి పథకాన్ని ఈ ఏడాది జులైలో ప్రారంభించింది. మన దేశంలో నివసించే వారు సహా ప్రవాస భారతీయులు(NRI) కూడా ఈ స్కీమ్ ద్వారా ఎస్‌బీఐ బ్యాంక్(SBI Bank)లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయొచ్చు. అయితే ఎస్‌బీఐ తీసుకొచ్చిన ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ పీరియడ్ మొత్తం 444 రోజులుగా ఉంటుంది. ఈ పథకం ద్వారా జనరల్ కస్టమర్లకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఉదాహరణకు ఒక సాధారణ కస్టమర్(General customer) ఎస్‌బీఐ అమృత్ వృష్టి పథకంలో రూ. 5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 444 రోజుల తర్వాత అతని చేతికి అసలు, వడ్డీతో కలుపుకొని రూ. 5,44,000 వరకు వస్తాయి. అదే ఒక సీనియర్ సిటిజన్(Senior citizen) రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 444 రోజులకు రూ. 5,47,300 వరకు అందుతుంది.


Similar News