SBI: రూ.17 వేల కోట్ల లాభాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశీయ ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది

Update: 2024-08-03 11:49 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వం రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ.17,035.16 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.16,884.29 కోట్లతో పోలిస్తే 0.89శాతం స్వల్పంగా పెరిగినట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజిలో తెలిపింది. సమీక్ష కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 6.2 శాతం పెరిగి రూ.1,11,535.98 కోట్లకు చేరుకుంది, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో రూ.95,975.45 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్-జూన్ కాలంలో మొత్తం ఆదాయం రూ.1,22,688 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.1,08,039 ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది.

బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల (NPA) నిష్పత్తి 2.76 శాతం నుంచి జూన్ 30 నాటికి 2.21 శాతానికి తగ్గింది. నికర NPA 0.57 శాతంగా ఉంది. బ్యాంక్ డిపాజిట్ల విషయానికి వస్తే, 8.18 శాతం పెరిగి రూ. 49.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.45.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ స్థూల అడ్వాన్స్‌లు సంవత్సరానికి 15.39 శాతం పెరిగి రూ.38.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, స్థూల అడ్వాన్సులు కేవలం 1.18 శాతం మాత్రమే పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల నుండి రూ. 25,000 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంది.

Tags:    

Similar News