SBI Loans: SBI కస్టమర్లకు భారీ షాక్.. రుణాలపై వడ్డీ రేట్లు పెంపు

దేశీయ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లలో మార్పులు తెచ్చింది

Update: 2024-08-15 10:14 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లలో మార్పులు తెచ్చింది. తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)‌ను 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ బ్యాంకులో తీసుకున్న లోన్లపై మరింత ఎక్కువ వడ్డీ పడుతుంది, EMIలు మరింత భారం అవుతాయి. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 15 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం, ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ గతంలో 8.10 శాతంతో పోలిస్తే ఇప్పుడు 8.20 శాతంగా ఉంది. నెలవారీ ఎంసీఎల్‌ఆర్‌ 8.35 శాతం నుండి 8.45 శాతానికి 3 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.40 శాతం నుండి 8.50 శాతానికి పెరిగింది.

ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరగ్గా, రెండేళ్ల కాలానికి 9.05 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి రుణ రేటు 9.10 శాతానికి చేరుకుంది. దీంతో ఆటో, గృహ రుణాలపై ఎక్కువ వడ్డీ పడుతుంది, వివిధ కాల వ్యవధిలో వినియోగదారుల రుణాలపై ప్రభావం చూపుతుంది. ఎంసీఎల్‌ఆర్‌ అనేది బ్యాంకు రుణంపై విధించే కనీస వడ్డీ రేటు. దీనిని నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నిర్దిష్ట లాభాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా బ్యాంకులు నిర్ణయిస్తాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించే కొన్ని నిర్దిష్ట సందర్భాలలో మినహా, ఒక బ్యాంకు తన డబ్బును రుణం ఇచ్చే కనీస వడ్డీ రేటు ఇది. ఒక బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ కంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇవ్వదు. ఆర్‌బీఐ(RBI) ఆగస్టు 8న జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో బెంచ్‌మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచగా, ఇప్పుడు ఆ జాబితాలో ఎస్‌బీఐ కూడా చేరింది.

Tags:    

Similar News