Janmashtami: జన్మాష్టమికి దేశమంతటా రూ.25 వేల కోట్ల వ్యాపారం

భారత్‌లో జన్మాష్టమి సందర్భంగా రూ.25,000 కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తాజాగా పేర్కొంది.

Update: 2024-08-27 08:19 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో జన్మాష్టమి సందర్భంగా రూ.25,000 కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తాజాగా పేర్కొంది. జన్మాష్టమికి పువ్వులు, పండ్లు, మిఠాయిలు, దేవతా వస్త్రాలు, అలంకార వస్తువులు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇది ఈ ఏడాది పండుగ సమయంలో జరిగిన అమ్మకాల లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. కాయిట్‌ (CAIT) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, పండుగల సమయంలో ప్రజలు భారీగా కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తారనడానికి ఇది ఉదాహరణ అని అన్నారు.

దేశంలో పండుగలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని, దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. పండుగ సందర్భంగా డిజిటల్ టేబుల్‌లాక్స్, శ్రీకృష్ణుడితో సెల్ఫీ పాయింట్లు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలా ఉంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్రకారం.. రాఖీ సందర్భంగా నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా రూ.12,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని అంచనా. అంతకుముందు 2022లో రాఖీ పండుగ సమయంలో రూ.7,000 కోట్లు, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ. 5,000 కోట్లు, 2019లో రూ.3,500 కోట్లు, 2018లో రూ. 3,000 కోట్ల వ్యాపారం జరిగిందని కాయిట్‌ నివేదిక పేర్కొంది.


Similar News